పోటీలో ముగ్గురు
సిడ్నీ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ ఆడడం ఖరారవ్వడంతో యువ పేసర్లు నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్.. ముగ్గురిలో ఒకరికి అవకాశం లభిస్తుంది. అయితే నటరాజన్కు రెడ్బాల్ క్రికెట్ అంతగా అనుభవం లేకపోవడంతో సైనీ, శార్దూల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా వారిద్దరిలో బంతిని స్వింగ్ చేయగలిగే శార్దూల్కు తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదే విషయాన్ని మాజీలు అభిప్రాయపడుతున్నారు. శార్దూలే జట్టులోకి వస్తాడని ప్రజ్ఞాన్ ఓజా, దీప్ దాస్గుప్తా భావిస్తున్నారు.
స్వింగ్ చేయగలిగే బౌలర్ అవసరం
తాజాగా ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ... 'బంతిని స్వింగ్ చేయడం శార్దూల్ ఠాకూర్ బలం. వేగంగా బంతులు వేసే జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ ఇప్పటికే జట్టులో ఉన్నారు. కాబట్టి సిడ్నీ టెస్టులో స్వింగ్ చేయగలిగే బౌలర్ టీమిండియాకు ఎంతో అవసరం. అయితే డెక్ కైండ్ బౌలర్ కావాలని యాజమాన్యం భావిస్తే.. సైనీ తుది జట్టులోకి వస్తాడు. ఏదేమైనా కీలక పేసర్లు గాయాలైనప్పటికీ టీమిండియాకు బెంచ్ బలం గొప్పగా ఉంది' అని అన్నాడు. ఎత్తు నుంచి బౌలింగ్ చేస్తూ బౌన్స్ను పొందడాన్ని డెక్ కైండ్ బౌలింగ్ అంటారు.
శార్దూల్ ఎంపిక సరైంది
మూడో పేసర్ అంశంపై దీప్ దాస్గుప్తా కూడా తన అభిప్రాయం తెలిపాడు. 'శార్దూల్ ఠాకూర్ ఎంపిక సరైంది. అతడు బంతిని బాగా స్వింగ్ చేయగలడు. అంతేగాక సిడ్నీ టెస్టుకు వరుణుడి ముప్పు ఉండటంతో జట్టుకు శార్దూల్ అవసరమే. ఇక బ్యాటింగ్ కూడా అతడు బాగా చేస్తాడు. లోయర్ ఆర్డర్ విభాగంలో ఇది బాగా ఉపయోగపడుతుంది' అని దాస్గుప్తా చెప్పాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో తగినంత అనుభవం ఉండడంతో ఠాకూర్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. శార్దుల్ ముంబై తరఫున 62 మ్యాచ్లు ఆడి 206 వికెట్లు తీశాడు. 6 అర్ధ శతకాలు ఉండడం కూడా సానుకూలాంశం.
'అవన్నీ తప్పుడు వార్తలు.. ఆసీస్ మీడియా ఇలా చేయడం సిగ్గుచేటు'