సరదాగా ఉండటంతో పాటు..
ఈ విరామంలో తనకు నచ్చిన ఎన్నో పన్నులు చేస్తున్నానని పూనమ్ తెలిపింది. ‘ఈ ఖాళీ సమయంలో చాలా పనులు చేసే అవకాశం లభించింది. కుంటుంబంతో గడుపుతున్నా, టీవీలో మహాభారత్, రామాయణ్ చూస్తున్నా. వంట నేర్చుకోమ్మని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. ఇప్పుడు వంట చేస్తున్నా. ఇంతకుముందు చాయ్, మ్యాగీ చేయడం తప్ప ఏదీ రాదు. కానీ లాక్ డౌన్ పుణ్యమా అని కొన్ని వంటలు నేర్చుకున్నా. తొలి రెండు నెలలు ఖాళీగానే ఉన్నా. కానీ తర్వాత మా అమ్మకు సాయం చేయడం మొదలు పెట్టా. అదే టైమ్లో నా ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా. క్రికెటర్లుగా మేం ఎప్పుడూ ఫిట్గా ఉండాలి. ఎందుకంటే ఆడమని ఏ టైమ్లో అయినా పిలుపు రావొచ్చు. అలాగే వారానికి మూడుసార్లు బౌలింగ్ చేయడం కూడా మొదలుపెట్టా.
బుల్లెట్ నడపాలనే కోరిక..
ఇక, బుల్లెట్ నడపాలని ఎప్పటినుంచో కోరిక ఉండేది. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా బైక్ రైడింగ్ నేర్చుకోలేకపోయా. అదే టైమ్లో కిందపడితే గాయాలవుతాయన్న భయం కూడా ఉండేది. అందువల్ల ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ, ఇప్పుడు మాత్రం మా బ్రదర్ సాయంతో బుల్లెట్ రైడ్ చేయడం నేర్చుకున్నా. ఇంకా పర్ఫెక్ట్ కాలేదు కానీ.. అత్యవసరమైతే నడపగలను. ఓ క్యారమ్ బోర్డు కూడా కొనుక్కోవాలని అనుకున్నా. అయితే, ఈ టైమ్లో బయట షాపింగ్కు వెళ్లడం మంచిది కాదని ఆ ఆలోచన విరమించుకున్నా'అని పూనమ్ చెప్పుకొచ్చింది.
ఇంగ్లండ్ టూర్ ఆగిపోవడంపై..
ఇక వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్నకు ముందు భారత్ ఏకైక అంతర్జాతీయ టోర్నీలో ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంది. కరోనా కారణంగా అది కాస్తా రద్దు కావడంతో పూనమ్ నిరాశ వ్యక్తం చేసింది. చివరగా ఈ ఏడాది మార్చిలో టీ20 ప్రపంచకప్ ఆడిన పూనమ్.. కరోనా కారణంగా నాలుగు నెలలుగా ప్రాక్టీస్కు దూరమైంది. తాజాగా ఇంగ్లండ్ టూర్ కూడా ఆగిపోవడంతో నేరుగా వన్డే ప్రపంచకప్లో సత్తా చాటాలంటే అంత సులువు కాదని పూనమ్ పేర్కొంది.
రెండు వారాల్లో క్లారిటీ..
న్యూజిలాండ్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సిన ఈ మెగా టోర్నీ భవితవ్యంపై రానున్న రెండు వారాల్లో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించింది. ‘ఇదో కఠిన సవాల్. నాలుగైదు నెలల విరామానంతరం మునుపటి ఫామ్ కొనసాగించలేం. చివరగా మార్చిలో బరిలో దిగాం. ఇప్పటికీ మేం ఆడబోయే తదుపరి సిరీస్పై స్పష్టత లేదు. ఒకవేళ అనుకున్న సమయానికి వన్డే ప్రపంచకప్ జరిగితే సన్నద్ధతకు సమయమే ఉండదు' అని భారత్ తరఫున ఒక టెస్టు, 46 వన్డేలు, 67 టి20లు ఆడిన పూనమ్ పేర్కొంది.