కరాచీ: కరోనా పుణ్యమా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి బహు కష్టం వచ్చింది. ఈ మహమ్మారి పుణ్యమా అగ్రరాజ్యలే అల్లాడుతున్నాయి. వ్యాపార రంగం పూర్తిగా కుదేలైంది. దీంతో పాక్ క్రికెట్ జట్టుకు స్పాన్సర్గా ఉండేందుకు పెద్ద కంపెనీలు ఏవీ ముందుకు రావడం లేదు. ఇన్ని రోజులు స్పాన్సర్గా వ్యవహరించిన పెప్సీ ఒప్పందం కూడా ఇటీవలే ముగిసింది.
దీంతో మళ్లీ స్పాన్సర్ కోసం ఇటీవల పీసీబీ టెండర్స్ను ఆహ్వానించగా.. పెప్సీ మినహా మరే కంపెనీ ముందుకు రాలేదని తెలుస్తుంది. ఇక పెప్సీ కూడా గతంలో కంటే 35-40 శాతం తగ్గించి మరీ బిడ్ దాఖలు చేసినట్లు సమాచారం. దీంతో వెనక్కు తగ్గిన పీసీబీ.. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యేలోపు స్పాన్సర్ను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
ఇంగ్లండ్తో సిరీస్ కోసం ఇప్పటికే అక్కడికి వెళ్లిన పాకిస్థాన్ టీమ్.. ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్లో ఉంది. ఇక ఆగస్టు 5 నుంచి ఇంగ్లీష్ జట్టుతో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ని పాక్ ఆడనుంది. ఈ సిరీస్లోపు కొత్త స్ఫాన్సర్ దొరక్కపోతే.. పాక్ ఆటగాళ్ల జెర్సీపై పీసీబీ లోగో మినహా మరేమీ ఉండకపోవచ్చు.
2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్లో ఉగ్రదాడి జరగగా.. అప్పటి నుంచి గత ఏడాది వరకూ పాక్లో పర్యటించేందుకు ఏ క్రికెట్ జట్టు సాహసించలేదు. దాంతో.. యూఏఈని తటస్థ వేదికగా చేసుకుని పాక్ సిరీస్లను ఆడింది. ఈ కారణంగా రూ. వేల కోట్లు నష్టపోయిన పీసీబీ.. అదే శ్రీలంకకు ఆతిథ్యం ఇచ్చి క్రికెట్ ఆడేందుకు తమ దేశం సురక్షితమని యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలియజేసింది.
ఇక పీఎస్ఎల్ టోర్నీని కూడా స్వదేశంలోనే నిర్వహించి ఆర్థికంగా కాస్త కోలుకున్నట్లు కనిపించింది. కానీ.. కరోనా వైరస్తో మార్చి నుంచి సిరీస్లన్నీ రద్దవగా.. మళ్లీ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన పీసీబీ.. ఇప్పుడు స్ఫాన్సర్స్ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
MS Dhoni Birthday: మసకబారుతున్న భారత క్రికెట్కు వెలుగునిచ్చిన మహేంద్రుడు!