ఆసియాకప్ రద్దు:
'వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సంవత్సరం ఆసియాకప్ 2020కి ఆతిథ్యం ఇవ్వడం చాలా ప్రమాదకరం. కాబట్టి ఆసియా క్రికెట్ కౌన్సిల్ వచ్చే ఏడాది టోర్నీ నిర్వహించాలని చూస్తోంది. టోర్నీని నిలిపివేయాలనే నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశం లేదు. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటగా టోర్నీ నిర్వహించాలనుకున్నాం కానీ యూఏఈ, పాకిస్తాన్ మరియు ఇతర దక్షిణాసియా దేశాలలో వైరస్ వ్యాప్తి చాలా ఉంది. శ్రీలంక క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపాం. స్వాప్ ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అనుమతించింది. పాకిస్థాన్ 2022లో ఆసియా కప్కి ఆతిథ్యమిస్తుంది' అని ఎహ్సాన్ మణి తెలిపారు.
ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యం:
జులై 9న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగడానికి ముందే సౌరవ్ గంగూలీ వాయిదా విషయం వెల్లడించడం గమనార్హం. బుధవారం ఒక ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్లో పాల్గొన్న గంగూలీ.. అందులో భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ జట్టును తిరిగి మైదానంలో ఎప్పుడు చూస్తామని ప్రశ్నించారు. దీనిపై గంగూలీ స్పందిస్తూ... 'టీమిండియా తొలి అంతర్జాతీయ సిరీస్ ఏదవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. మా సన్నద్ధత సాగుతోంది. అయితే ప్రభుత్వ నిబంధనలు తెలిసేదాకా ఏమీ చేయలేం. ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి మేం దేనికీ తొందరపడటం లేదు. నెలవారీగా అన్నిటినీ పర్యవేక్షస్తున్నాం' అని తెలిపారు.
పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో:
'ఐపీఎల్ 2020 వాయిదా పడింది. టీ20 ప్రపంచకప్పై ఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంటే.. మనం ఐపీఎల్ గురించి ఆలోచించగలము. ఇక సెప్టెంబరులో జరగాల్సిన ఆసియాకప్ 2020 రద్దు చేయబడింది. కాబట్టి భారతదేశంలో క్రికెట్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో ప్రస్తుతానికి నేను చెప్పలేను' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పారు. షెడ్యూలు ప్రకారం ఆసియాకప్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాలి. దాయాది దేశానికి వెళ్లేందుకు బీసీసీఐ ఇష్టపడకపోవడంతో వేదిక శ్రీలంక లేదా దుబాయ్కు మారింది. సెప్టెంబర్లో టోర్నీ నిర్వహించాలి. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్-వెస్టిండీస్ టెస్టుకు వర్షం అంతరాయం.. 17.4 ఓవర్లు మాత్రమే సాగిన ఆట.. స్కోర్ 35/1