ఆసియా కప్పై నో కార్లిటీ: బీసీసీఐ
‘ఈ ఏడాది ఆసియాకప్ను నిర్వహిస్తే చాలా బాగుండేది. ఎందుకంటే టీ20 వరల్డ్కప్ కోసం వెళ్లే ఆసియా టీమ్లకు ఇది మంచి ట్రెయినింగ్లాగా ఉండేది. ఇప్పటికిప్పుడు క్రికెట్ షెడ్యూల్ గురించి మాట్లాడటం సరైంది కాదు. ఎందుకంటే కరోనాతో ఎఫ్టీపీ మొత్తం మారిపోయింది. ఏయే దేశాలు ఎప్పుడెప్పుడు క్రికెట్ను మొదలుపెడుతున్నాయో తెలియదు. కొన్నిదేశాల్లో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆసియాకప్ జరగడం కష్టమేనని చెప్పొచ్చు'అని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.
తటస్థ వేదికను నిర్ణయించాలి..?
షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ సెప్టెంబర్లో జరగాల్సింది. ఈ మెగాటోర్నీని పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే పాక్కు రావడంపై భారత్ అయిష్టత వ్యక్తం చేయ డంతో తటస్థ వేదికలో ఆడేందుకు పాక్ క్రికెట్ బోర్డు సుముఖత వ్యక్తం చేసింది. వేదికను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లో చర్చించి ఖారారు చేయాల్సి ఉంది.
అయితే ఇంతలోనే కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం.. క్రీడా టోర్నీలన్నీ రద్దవ్వడంతో ఏసీసీ సమావేశం జరగలేదు. పైగా బీసీసీఐ కూడా టోర్నీ జరగడం కష్టమేనని తెలపడం.. వాయిదాపడ్డ ఐపీఎల్ 2020 సీజన్ సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించడంతో ఆసియాకప్ రద్దవుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది.
అన్నీ గాలి వార్తలే..
అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎహ్సెన్ మణి మాత్రం ఈ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియాకప్పై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు. రద్దవుతుందనేది గాలి వార్తలేనని కొట్టిపారేశాడు.
‘ఆసియాకప్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు చర్చే జరగలేదు. కనీసం ఏతేదీన సమావేశం అవుదామనేది కూడా నిర్ణయించలేదు. ఏసీసీ ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుంది'అని ఎహ్సెన్ మణి మీడియాకు తెలిపారు.
ఏప్రిల్ నెలాఖరులో ఫైనల్ డిసిషన్..
ఏప్రిల్ నెలాఖరులో ఆసియాకప్పై ఫైనల్ డిసిషన్ తీసుకుంటారని ఆసియా క్రికెట్ బోర్డుల్లోని ఓ అధికారి తెలిపారు. అప్పటి కరోనా పరిస్థితులపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నాడు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ అనేది చివరి అంశం. కానీ ఆసియా క్రికెట్ బోర్డులు, ఏసీసీ కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఆసియాకప్ నిర్వహణకు ఇంకా సమయం ఉంది. పరిస్థితులు మెరుగయ్యాకే ఏసీసీ సమావేశం జరుగుతుంది.' సదరు అధికారి తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఆసియాకప్ వాయిదా, రద్దు అనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని మరో అధికారి స్పష్టం చేశారు.