
కరాచీ: అనిశ్చితికి మారుపేరు అయిన పాకిస్థాన్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్గా ఎంపికైన మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) షాకిచ్చింది. అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు సోమవారం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అఫ్రిది స్థానంలో 69 ఏళ్ల హరూన్ రషీద్ను చీఫ్ సెలెక్టర్గా నియమిస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. కమిటీలోని మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.
టీ20 ప్రపంచకప్ ఓటమి అనంతరం పీసీబీ చైర్మన్ పదవి బాధ్యతల నుంచి రమీజ్ రాజాను తప్పించి నజమ్ సేథీకి మళ్లీ ఆ బాధ్యతలు అప్పగించారు.పీసీబీ చీఫ్గా నజమ్ సేథీ బాధ్యతలు చేపట్టాక నాటి చీఫ్ సెలెక్టర్ మహ్మద్ వసీంను తొలగించిన పీసీబీ.. ఆ పదవిలో షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్గా ఎంపిక చేసింది. అఫ్రిది వ్యవహారం కూడా ఫలితం ఇవ్వకపోవడంతో పాటు వివాదాలకు కారణమవడంతో అతనిపై కూడా వేటు వేసింది.ఇంత ఆకస్మికంగా పీసీబీ అఫ్రిదికి కూడా ఉద్వాసన పలికి హరూన్ రషీద్కు బాధ్యతలు అప్పజెప్పడం పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పాకిస్థాన్ తరఫున 23 టెస్ట్లు, 12 వన్డేలు ఆడిన హరూన్ రషీద్.. 2015 నుంచి 2016 వరకు పాక్ చీఫ్ సెలెక్టర్గా పని చేశాడు. రషీద్.. పీసీబీని నడుపుతున్న 14 మంది సభ్యుల క్రికెట్ మేనేజ్మెంట్ కమిటీలోనూ కీలక మెంబర్గా కొనసాగుతున్నాడు. కాగా, స్వదేశంలో గతకొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ను తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీకి కొత్త బాస్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతుల్లో సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్ జట్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.