టీమిండియాలో అతనో రాతి గోడ.. అలా దెబ్బలు తాకించుకునే ఆటగాడిని చూడలేదు: కమిన్స్

సిడ్నీ: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయావాల్ చతేశ్వర్ పుజారాపై ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో పటిష్టమైన ఓ రాతిగోడ అని, క్లాస్ ఆటగాడని కొనియాడాడు. క్రీజులో అతను చూపించే ఓపికకు ఎవరైనా దండం పెట్టాల్సిందేనన్నాడు. ఒక్క ముక్క మాట్లాడకున్నా పుజారా గురించి తనకెంతో తెలిసినట్టు అనిపిస్తుందని పేర్కొన్నాడు. గబ్బా టెస్టులో అతను మొక్కవోని ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడని, ఒక ఎండ్లో పుజారా, మరో ఎండ్లో పంత్ను చూడటం విచిత్రంగా అనిపించిందని వెల్లడించాడు. తాజాగా క్రిక్బజ్తో మాట్లాడిన ప్యాట్ కమిన్స్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అతనో రాతి గోడ..
'పుజారాతో నేనొక్కసారీ కూడా మాట్లాడలేదు. కానీ నాకు అతని గురించి ఎంతో తెలుసనిపిస్తుంది. అతనో పటిష్ఠమైన రాతిగోడ. రెండేళ్ల క్రితం ఆడినట్టు అతను ప్రభావం చూపకపోవడంతో చివరి సిరీస్లో మేం సులువుగా విజయం సాధిస్తామనిపించింది. కానీ సిడ్నీ, గబ్బా టెస్ట్ల్లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తిరుగులేని డిఫెన్స్ ఆడగలిగే బ్యాట్స్మన్ కూడా కొన్ని షాట్లు ఆడితే అతని వైఖరిలో మార్పు వస్తుంది. అప్పుడు తనకు అవకాశం దొరుకుతుందని బౌలర్ భావిస్తాడు.

శరీరానికి దెబ్బలు..
కానీ నాలుగో టెస్ట్లో పుజారా తన దేహానికి బంతులు తగిలించుకున్నాడు. పంటి బిగువన నొప్పిని భరించాడు. నిజంగా అది సాహసోపేత ఇన్నింగ్సే. అలా దెబ్బలు తగిలించుకున్న వారిని నేనెప్పుడూ చూడలేదు. అతనో క్లాస్ ఆటగాడు. ఇక రిషభ్ పంత్తో కలిసి పుజారా ఆడాడు. వీరిద్దరివీ భిన్న వ్యక్తిత్వాలు. కానీ అభిమానులు వారిద్దరినీ ప్రశంసించాల్సిందే. టెస్టు క్రికెట్ను ఇష్టపడేందుకు ఇవన్నీ ప్రేరణనిస్తాయి' అని కమిన్స్ వెల్లడించాడు.

పుజారా కీలకం..
ఇక ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా వరుసగా రెండు సిరీసులు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చివరి పర్యటనలో కోహ్లీ లేకున్నా, సీనియర్ బౌలర్లు గాయపడ్డా కుర్రాళ్లు అదరగొట్టారు. గబ్బాలో జరిగిన ఆఖరి టెస్టులో పుజారా అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్, మిడిలార్డర్లో రిషభ్ పంత్తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బంతులు దేహానికి తగులుతున్నా గోడలా నిలబడ్డాడు. కుర్రాళ్లు స్వేచ్ఛగా పరుగులు చేసేందుకు బాటలు వేశాడు. అయితే ఈ రెండు సిరీస్ విజయాల్లో పుజారా పాత్ర కీలకం. 2020-21 ఆసీస్ పర్యటనలో 33.88 యావరేజ్, మూడు హాఫ్ సెంచరీలతో 271 పరుగులు చేసిన పుజారా.. 2018-19 టూర్లో 74.43 సగటుతో 521 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు ఓ హాఫ్ సెంచరీ ఉంది.

కమిన్స్ దూరం..
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో కష్టాలపాలైన ఆసీస్ ఆటగాళ్లు సుమారు 25 రోజుల తర్వాత గత సోమవారమే సొంత గూటికీ చేరారు. ఈ 25 రోజులు క్వారంటైన్లో ఉంటూ నరకం అనుభవించారు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ రెండో దశ మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవ్వగా.. క్వారంటైన్ నిబంధనలతో విసిగిపోయిన కమిన్స్ దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. కొన్నాళ్లు క్రికెట్కు బ్రేక్ ఇస్తానని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications