కరాచీ: ఐపీఎల్ 2022 సీజన్లో దారుణంగా విఫలమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకోవాలని పాకిస్థాన్ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ మహ్మద్ రిజ్వాన్ ఆకాంక్షించాడు. అందుకోసం ఆ అల్లాను ప్రార్థిస్తానని చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్లో కోహ్లీ 12 మ్యాచ్లు ఆడి కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్రేట్ 19.64గా నమోదైంది. ఇది కోహ్లీ టీ20 లీగ్ కెరీర్లోనే అత్యంత పేలవమైన ప్రదర్శన. ఈ నేపథ్యంలోనే రిజ్వాన్ ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ కోహ్లీ ఫామ్పై స్పందించాడు.
'విరాట్ కోహ్లీ ఓ ఛాంపియన్. అయితే, ఇప్పుడు సరిగ్గా ఆడలేకపోతున్నాడు. అందుకోసం నేను ప్రార్థిస్తా. ఎందుకంటే అతను చాలా కష్టపడే ఆటగాడు. ఆటగాళ్లకు కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తర్వాత తిరిగి పుంజుకుంటారు. క్రికెట్లో ఎంతో మంది సెంచరీలు కొట్టారు. అవి అలాగే జరిగిపోతుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని కోసం నేను దేవుడిని మాత్రమే ప్రార్థించగలను. విరాట్ మరింత కష్టపడి పరిస్థితుల్ని మళ్లీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడని ఆశిస్తున్నా' అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత టీమిండియా సౌతాఫ్రికాతో ఆడే టీ20 సిరీస్కు సెలెక్షన్ కమిటీ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆపై ఇంగ్లండ్ పర్యటనలో అతను రాణించేందుకు ఈ విరామం ఉపయోగపడుతుందని టీమ్మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే ఇంగ్లండ్ పర్యటనలోనూ విరాట్ విఫలమైతే ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.