న్యూఢిల్లీ: జట్టును దూకుడుగా నడిపించడంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కంటే టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో ముందున్నాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ అన్నాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి జో రూట్ చెత్త కెప్టెన్సీనే కారణమని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తుది జట్టు ఎంపిక నుంచి టీమ్ను నడిపించిన తీరు వరకు జో రూట్ విఫలమయ్యాడన్నారు. ఈ క్రమంలోనే పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సైతం.. జో రూట్ కెప్టెన్సీని తప్పుబట్టాడు.
విరాట్ కోహ్లీ సారథ్యంతో జో రూట్ను పోల్చుతూ విమర్శలు గుప్పించాడు. 'ప్రత్యర్థి జట్టును సవాల్ చేసే వైఖరి విరాట్ కోహ్లీది. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో అతని మాదిరిగా దూకుడుగా బ్యాటింగ్ చేయడం అవసరం. అయితే ఇలాంటి వైఖరి జో రూట్లో కనిపించలేదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త టెన్షన్గా కనిపించాడు. అయితే విరాట్ కోహ్లీ ముఖంలో మాత్రం ఎప్పుడూ ఇది చూడలేదు. ఆసీస్తో ఆడేటప్పుడు రూట్ కంటే కోహ్లీ బాడీలాంగ్వేజ్, గెలవాలనే కసి తీవ్రంగా కనిపిస్తుంది'' అని చెప్పుకొచ్చాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్లో 425 పరుగులు చేసి 278 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో జో రూట్ (89), డేవిడ్ మలన్ (82) రాణించడంతో ఇంగ్లండ్ మళ్లీ రేసులోకి వచ్చినట్లు అనిపించింది. అయితే కీలకమైన సమయాల్లో వికెట్లను చేజార్చుకున్న ఇంగ్లీష్ జట్టు 297 పరుగులకే ఆలౌటైంది. 74 పరుగుల వ్యవధిలోనే చివరి 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. అనంతరం 20 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం ఒక్క వికెట్ను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 16 (గురువారం) నుంచి ప్రారంభం కానుంది.