రావల్పిండి: పాకిస్థాన్ పర్యటనలో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. పరుగుల వరద పారిన తొలి టెస్ట్లో రఫ్ఫాడించిన ఇంగ్లండ్ 75 పరుగుల తేడాతో ఆతిథ్య పాకిస్థాన్ను ఓడించింది. 22 ఏళ్ల తర్వాత పాక్ను సొంత గడ్డపై ఇంగ్లండ్ ఓడించింది. 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 96.3 ఓవర్లలో 268 పరుగులకు కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్(159 బంతుల్లో 12 ఫోర్లతో 76), ఇమామ్ ఉల్ హక్(77 బంతుల్లో 8 ఫోర్లతో 48) టాప్ స్కోరర్లుగా నిలవగా.. అజార్ అలీ(40), మహమ్మద్ రిజ్వాన్(46) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(4/22), జేమ్స్ అండర్సన్(4/36) నాలుగేసి వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. జాక్ లీచ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ చెరొక వికెట్ పడగొట్టారు.
80/2 ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్.. ఆదిలోనే ఇమామ్ ఉల్ హక్ వికెట్ కోల్పోయింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో ఇమామ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మహమ్మద్ రిజ్వాన్తో కలిసి సౌద్ షకీల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 87 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకంగా మారిన ఈ జోడీని అండర్సన్ విడదీసాడు.
రిజ్వాన్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే సౌద్ షకీల్ కూడా ఔటవ్వడంతో పాక్ పతనం మొదలైంది. అఘా సల్మాన్(30) ఇంగ్లండ్ విజయాన్ని కాస్త ఆలస్యం చేసినా.. రాబిన్సన్, అండర్సన్ విరుచుకుపడటంతో పాక్ టెయిలండర్స్ నసీమ్ షా(6), జాహిద్ మహ్మూద్(1), హరీస్ రౌఫ్(0) వరుసగా ఔటయ్యారు. దాంతో ఇంగ్లండ్ విజయం లాంఛనమైంది. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఓలీ రాబిన్సన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ శుక్రవారం నుంచి ముల్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి ఇన్నింగ్స్లో 657 పరుగుల భారీ స్కోర్ చేసిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో 264/7 పరుగుల వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది.