హైదరాబాద్: సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇదే రోజు (1997, మార్చి 7) క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుత రికార్డు నమోదైంది. అప్పటి వరకు కనీ వినీ ఎరుగని ఆ రికార్డు.. నాటి అభిమానులను కనువిందు చేసింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ. అది కూడా కేవలం 17 బంతుల్లోనే నాటి శ్రీలంక ఓపెనర్ సనత్ జయసూర్య నెలకొల్పాడు.
భారత్, పాకిస్థాన్, శ్రీలంక మధ్య సింగపూర్ వేదికగా జరిగిన సింగర్ కప్ ట్రై సిరీస్లో ఈ సూపర్ రికార్డు నమోదైంది. అది కూడా పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో జయసూర్య ఈ ఫీట్ అందుకోవడం విశేషం. విచిత్రం ఏంటంటే ఈ మ్యాచ్లో శ్రీలంక 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఐపీఎల్ జరగకపోతే సిగ్గు చేటు: జోస్ బట్లర్
ఈ మ్యాచ్లో అర్జున్ రణతుంగ సారథ్యంలోని శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. పాకిస్థాన్ బ్యాటింగ్కు దిగింది. నాటి పాక్ బ్యాట్స్మన్ ఇజాజ్ అహ్మద్ (51) రాణించడంతో ఆ జట్టు 215 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక.. జయసూర్య విధ్వంసకర బ్యాటింగ్తో గెలుపు దిశగా దూసుకెళ్లింది. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జయసూర్య వన్డేల్లో వేగవంతమైన అర్థ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక 28 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేసిన జయసూర్య వెనుదిరగ్గా.. శ్రీలంక తడబడింది. మిగతా బ్యాట్స్మన్ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టడంతో అనూహ్యంగా ఓటమిపాలై టైటిల్ చేజార్చుకుంది.
ఇక 2015 వరకు చెక్కు చెదరకుండా జయసూర్య పేరిట ఉన్న ఈ రికార్డును సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి బద్దలు కొట్టాడు.