హైదరాబాద్: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (38 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ రోహిత్ శర్మ (22 బంతుల్లో 24) ఫర్వాలేదనిపించారు.
అనంతరం 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసింది. పూణె విజయానికి ఆఖరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు అవసరం. తొలి బంతిని మనోజ్ తివారీ చక్కటి ఫోర్గా మలిచాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
అయితే తర్వాతి రెండు బంతుల్లో మనోజ్ తివారీ, స్మిత్లను ఔట్ చేసిన మిచెల్ జాన్సన్ మ్యాచ్ని ముంబైవైపు తిప్పాడు. చివరి 3 బంతుల్లో 5 పరుగులు చేసినా పూణెకు ఓటమి తప్పలేదు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా, మూడో పరుగు తీసే ప్రయత్నంలో సుచిత్ త్రోకు క్రిస్టియన్ ఔటయ్యాడు.
దీంతో ముంబై ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. స్టీవ్ స్మిత్ (50 బంతుల్లో 51), రహానే (38 బంతుల్లో 44) పరుగులతో రాణించారు. కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఏడాది సీజన్లో ఢిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబై అభిమానులను తీవ్రంగా నిరాశపరించింది.
టోర్నీ ఆరంభం నుంచే తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చలేకపోయింది. టోర్నీ ఆరంభంలోనే వరుస పరాజయాలను చవిచూసిన ముంబై ఇండియన్స్ చివర్లో అనూహ్యంగా చెలరేగి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 11 పరుగుల తేడాతో ఓటమిపాలై లీగ్ దశ నుంచి నిష్క్రమించింది.