
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత క్రికెట్ జట్టు అదరగొడుతుంది. వన్డే సిరీజ్ చేజార్చుకొని తడబడినా.. ఆ తర్వాత నేలకు కొట్టిన బంతిలా పుంజుకొని హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఆదివారం ఆతిథ్య జట్టుతో జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించి 6 వికెట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన.. శిఖర్ ధావన్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52), మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా(22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్), విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), కేఎల్ రాహుల్(22 బంతుల్లో 2 సిక్స్తో 30) మెరుపులు మెరిపించడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకొని సునాయసంగా గెలుపొందింది.
ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్, తాత్కలిక కెప్టెన్ మాథ్యూ వేడ్, టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మాథ్యూ వేడ్ మాటలు స్టంప్ మైక్లో రికార్డవ్వడంతో ఆ సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
ఇంతకీ విషయం ఏంటంటే..శిఖర్ ధావన్ను స్టంపౌట్ చేసే అవకాశాన్ని మాథ్యూ వేడ్ చేజార్చాడు.స్పిన్నర్ స్వెప్సన్ బౌలింగ్లో ఓ కాలు క్రీజ్ బయట పెట్టిన శిఖర్ ధావన్ బంతిని కట్ చేయబోయాడు. కానీ అది చాలా దూరంగా వెళ్లడంతో.. షాట్ మిస్సయ్యాడు. ధావన్ బ్యాలెన్స్ కోసం క్రీజ్లోపల ఉంచిన పాదాన్ని పైకి లేపగా.. వికెట్ల వెనుక ఉన్న మాథ్యూ వేడ్.. వెంటనే బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. కానీ ధావన్ అప్పటికే క్రీజ్లో పాదాన్ని మోపాడు.
39 పరుగుల వద్ద ధావన్ను ఔట్ చేసే అవకాశాన్ని జారవిడ్చిన వేడ్.. 'ధోనీలా రెప్పపాటులో స్టంపౌట్ చేయడానికి నేను ధోనీని కాదు'అని శిఖర్తో నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్కు ధావన్ కూడా నవ్వుతూ అవును అన్నట్లు తలూపాడు. వికెట్ల వెనుక మెరుపు వేగంతో స్పందించే ధోనీ.. రెప్పపాటులో స్టంపౌట్ చేసి ఎంతో మంది బ్యాట్స్మెన్ను పెవిలియన్ చేర్చడాన్ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. కెరీర్ చరమాంకంలో ధోనీ బ్యాటింగ్లో పదును తగ్గినా.. వికెట్ల వెనుక చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్ 2020 సీజన్లో కూడా ధోనీ తన మార్క్ కీపింగ్తో ఆకట్టుకున్నాడు.