|
టీమిండియాను కివీస్ ఓడిస్తుంది
తాజాగా ఇంగ్లండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను న్యూజిలాండ్ 1-0తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో సిరీస్ నెగ్గి.. 1999 తర్వాత మరోసారి ఈ ఘనత సాధించింది. ఇక ఇంగ్లండ్పై సిరీస్ విజయంతో ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో కివీస్ అగ్రస్థానానికి చేరుకుంది.
ఈ విషయంపై స్పందించిన ప్రముఖ కామెంటేటర్ మైఖేల్ వాన్.. 'న్యూజిలాండ్ హైక్లాస్ టీం. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని బ్యాట్, బంతితో సత్తాచాటారు. కచ్చితంగా వచ్చే వారంలో టీమిండియాను కివీస్ ఓడిస్తుంది' అని పేర్కొన్నాడు. ఇలా భారత్పై వాన్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు.
నీ పని అయిపోయింది
మైఖేల్ వాన్ ట్వీట్పై టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ స్పందించాడు. బాలీవుడ్ సినిమాకు సంబంధించిన మీమ్ షేర్ చేసి ట్రోల్ చేశాడు. 'మా వాళ్ల చేతిలో నీ పని అయిపోయింది.. ఇక వెళ్లు' అని రిప్లై ఇచ్చాడు. భారత ఫాన్స్ ఇక నిన్ను ఆడుకుంటారు అని జాఫర్ పరోక్ష్యంగా చెప్పాడు. మరోవైపు ఫాన్స్ కూడా వాన్ ట్వీట్పై మండిపడుతున్నారు. 'ఇంగ్లండ్ ఓటమిని కూడా వాన్ ఇలా కవర్ చేసేశాడు' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'సూపర్ జాఫర్ భాయ్ అదరగొట్టేశారు.. వాన్కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చారు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇక జూన్ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
WTC Final: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీన మద్దతు టీమిండియాకే!!
భవిష్యత్తులో అది ఇంగ్లండ్కే నష్టం
టీమిండియాతో జరిగే ఐదు టెస్టుల సిరీస్లో పచ్చిక మైదానాల్లో ఒకే రకమైన పిచ్లు తయారు చేస్తే.. భవిష్యత్తులో అది ఇంగ్లండ్కే నష్టమని మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తాజాగా అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఓడిపోయిన నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. కివీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో స్పెషలిస్టు స్పిన్నర్ను తీసుకోకపోవడమే ఇంగ్లండ్ చేసిన తప్పని వాన్ పేర్కొన్నాడు. లార్డ్స్లో జరిగిన తొలి టెస్టులో వర్షం కారణంగా ఇంగ్లండ్కు కలిసివచ్చిందని, రెండో టెస్టులోనూ అలాంటి పిచ్నే రూపొందించడం వ్యూహాత్మక తప్పిదమని వివరించాడు.
రెండు బృందాలుగా విడిపోయి ఆడినా సరిపోదు
స్వల్ప తేడాతో టెస్టు మ్యాచ్లు గెలుపొందినా అది ఇంగ్లండ్కు మంచి చేయదని మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. భారత్ త్వరలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో ఆడనుందని.. అలాంటప్పుడు మంచి వికెట్లపై ఎలా ఆడాలో ఎలా గెలవాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండే ఫేవరెట్ జట్టని ఇంగ్లీష్ కామెంటేటర్ చెప్పాడు. ఇంగ్లండ్తో రెండు టెస్టులు ఆడటం వల్ల ఆ జట్టుకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నాడు. భారత్ ప్రాక్టీస్ సెషన్లో రెండు బృందాలుగా విడిపోయి ఆడినా.. అది అంతర్జాతీయ మ్యాచ్లతో పోలిస్తే సరిపోదని వాన్ వెల్లడించాడు.