హైదరాబాద్: క్రికెట్ చరిత్రలో తొలిసారి జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. మరో నాలుగు రోజులో మెగా సమరం ఆరంభం కానుంది. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. జూన్ 18న భారత్-న్యూజిలాండ్ జట్ల ప్రారంభమయ్యే ఫైనల్ గురించి మాజీలు తమతమ అభిప్రాయాలు చెప్పారు. భారత్ గెలుస్తుందని కొందరు, కివీస్ విజయం సాదిస్తుందని ఇంకొందరు జోస్యం చెప్పారు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టే విజయకేతనం ఎగురవేస్తుందంటూ చాలామంది అంటున్నారు.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా అని టీమిండియా అభిమానులు ఎదురుచూస్తున్నారు. పలు మీమ్స్, ఫొటోలతో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీన ఇన్స్టాలో షేర్ చేసిన ఓ పోస్టు ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. బ్యాట్ చేతబట్టి సీరియస్ లుక్తో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటోను పంచుకున్న జాన్ సీన.. ఎలాంటి క్యాప్షన్ మాత్రం పెట్టలేదు. దీంతో ఫాన్స్ సొంత వ్యాఖ్యలు జోడిస్తున్నారు. 'జాన్ సీన మద్దతు టీమిండియాకే' ఒకరు పోస్ట్ చేయగా.. 'కింగ్ కోహ్లీ ప్రతి చోట ఉంటాడు.. అతడి ప్రజాదరణను చూసి ఆశ్చర్యపోయా' అని మరొకరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నట్టింట వైరల్ అయ్యాయి.
WTC Final: క్యూరేటర్కు ఐసీసీ మార్గదర్శకాలు.. పిచ్ ఎవరికి అనుకూలమో తెలుసా?!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వాయిదా పడిన అనంతరం ఇళ్లకు వెళ్లిపోయిన టీమిండియా ప్లేయర్స్.. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు. అనంతరం సుదీర్ఘ ఇంగ్లీష్ పర్యటన కోసం ముంబైలో రెండు వారాల క్వారంటైన్ తర్వాత.. జూన్ 3న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్కు చేరుకున్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్లో ఉన్నారు. ఆపై మూడు రోజులు ఒక్కో ప్లేయర్ సాధన చేశారు. ఇక గురువారం నుంచి అందరూ కలిసి జట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏజీస్ బౌల్ స్టేడియానికి ఆనుకోని ఉన్న హిల్టన్ హోటల్లో కోహ్లీసేన బస చేస్తున్నది.
ఫైనల్ కోసం ఆదివారం రెండు జట్లుగా విడిపోయిన భారత ఆటగాళ్లు ప్రాక్టీసు మ్యాచ్ ఆడారు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత సెంచరీతో (94 బంతుల్లోనే 121 పరుగులు) అజేయంగా నిలువగా.. ఓపెనర్ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీతో (135 బంతుల్లో 85 పరుగులు) రాణించాడు. బౌలర్లలో ఇషాంత్ శర్మ (3/36) ఒక్కడే పర్వాలేదనించాడు. భారత్ వరుస టెస్ట్ విజయాలతో జోరు మీద ఉండటం.. ఇంగ్లండ్పై కివీస్ టెస్టు సిరీస్ గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.