ఐసీసీ రూల్స్
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ ఆటలో తాత్కాలిక నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మి (సలైవా)పై నిషేధం, ద్వైపాక్షిక సిరీస్లను స్థానిక అంపైర్లతో నిర్వహించడం, టెస్టుల్లో కొవిడ్-19 సబ్స్టిట్యూట్, టెస్టుల్లో మూడు డీఆర్ఎస్ రివ్యూలు, వన్డే-టీ20లకు రెండు రివ్యూలు, టెస్టు జెర్సీపై అదనపు లోగో వంటి కొత్త రూల్స్ ఐసీసీ తీసుకొచ్చింది. వీటన్నింటిని ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభం కానున్న ఇంగ్లండ్-వెస్టిండీస్ టెస్టులో అమలు చేయనున్నారు. అయితే కొత్త రూల్స్ కారణంగా ఆటగాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఉమ్మి రుద్దితే
కరోనా వైరస్ ఉమ్మితో వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో దాన్ని నిషేధం విధించిన ఐసీసీ.. చెమటను వినియోగించేందుకు మాత్రం అనుమతిచ్చింది. టెస్టుల్లో బౌలర్లు బంతిపై ఉమ్మి ఉపయోగిస్తే.. అలవాటు పడే వరకు అనుమతిస్తారు. అయితే అదేపనిగా ఉమ్మిని వాడితే.. ఇన్నింగ్స్కు రెండు సార్లు హెచ్చరిస్తారు. అప్పటికీ సదరు ఆటగాడిలో మార్పు రాకుంటే..పెనాల్టీ కింద బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు జతచేస్తారు. అంటే బౌలింగ్ చేసే జట్టు అందనంగా 5 రన్స్ ఇచ్చుకోవడమే.
స్థానిక అంపైర్లతో:
టెస్టుల్లో కొవిడ్-19 సబ్స్టిట్యూషన్కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏ ఆటగానికైనా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తేలితే అతని స్థానంలో మరొకరిని అనుమతించనున్నారు. ద్వైపాక్షిక సిరీస్లను స్థానిక అంపైర్లతో నిర్వహించనున్నారు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్లు.. విధులు నిర్వర్తిస్తారని ఐసీసీ పేర్కొంది. ఇక అంపైర్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని డీఆర్ఎస్ రివ్యూల సంఖ్యను పెంచింది. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్కు మూడు రివ్యూలు.. వన్డేలు, టీ20లకు రెండు రివ్యూల చొప్పున ఐసీసీ కేటాయించింది.
కొత్త లోగో:
టెస్టు జెర్సీపై కొత్త లోగోకు ఐసీసీ అనుమతిచ్చింది. ప్రస్తుతమున్న మూడు లోగోలకు ఇది అదనం. ఇప్పటి వరకు వన్డే, టీ20ల్లో మాత్రమే చెస్ట్పై లోగోలకు అనుమతివ్వగా.. తాజాగా టెస్టుల్లో కూడా చాన్స్ ఇచ్చింది. ఈ రోజు మొదలవనున్న తొలి టెస్టుకు సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ కోసం కరీబియన్ దీవుల నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వెస్టిండీస్ జట్టు 14 రోజుల క్వారంటైన్ను ముగించుకొని మ్యాచ్కు రెడీ అయింది. ఇక మైదానంలో అభిమానులు లేకున్నా ఆటగాళ్లకు ఆ లోటు కనిపించకూడదని.. కేరింతలతో కూడిన శబ్దాలు, మ్యూజిక్ను ఏర్పాటు చేసిన ఈసీబీ ఈ సిరీస్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.