మెల్బోర్న్: వికెట్పై కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారని ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లయన్ అన్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో పిచ్ నాణ్యతపై చర్చ కొనసాగుతూనే ఉంది. మొతెరా పిచ్ టెస్ట్ క్రికెట్కు పనికిరాదంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో మొతేరా పిచ్పై స్పందించిన నాథన్ లయన్ వికెట్ బాగుందని కొనియాడాడు. అహ్మదాబాద్ పిచ్ క్యూరేటర్ను తాను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పాడు.
పూర్తిగా పేస్కు అనుకూలించే పిచ్లపై బ్యాట్స్మన్ అత్యల్ప స్కోర్కు ఔటైనా ఏ ఒక్కరు విమర్శించరని, అదే టర్నింగ్ ట్రాక్పై అలా జరిగితే మాత్రం ఏడుపు మొదలుపెడతారని అసహనం వ్యక్తం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్తో మాట్లాడిన లయన్.. మొతెరా పిచ్ను వెనుకేసుకొచ్చాడు.
'టర్నింగ్ ట్రాక్ పై ఇంగ్లండ్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. ఇది చాలు. ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు. ఈ వికెట్పై స్పిన్ బౌలింగ్ను చూడటానికి నేను రాత్రంగా మెలుకవగానే ఉన్నాను. పేస్ బౌలింగ్కు బ్యాట్స్మెన్ ఇబ్బంది పడినప్పుడు ఎవరూ మాట్లాడరు. పేస్ పిచ్లపై ఆడి 47, 60 పరుగులకు ఆలౌటైతే కూడా ఏమీ పట్టనట్లు ఉంటారు. పిచ్పై ఎవరూ ఎలాంటి విమర్శలు చేయరు. కానీ పిచ్ స్పిన్ అవడం మొదలైతే చాలు ఏడుపు మొదలుపెడతారు' అని లయన్ చాలా ఘాటుగా విమర్శించాడు.
ఇక భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా విమర్శకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ రిజల్ట్ అనంతరం పిచ్ కండిషన్పై విమర్శలు రావడం చాలాకాలంగా ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కనీసం ఒక్క పింక్ బాల్ మ్యాచ్ కూడా ఆడని వాళ్లు కూడా కామెంట్ చేయడం దురదృష్టకరమన్నాడు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.