ఢాకా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ఆడితే తనకు కోటీ టాకాల(రూ.87.23 లక్షలు) ఆదాయం వచ్చేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఆ జట్టు స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈ బంగ్లా పేసర్ కోసం ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు ప్రయత్నించాయి. అయితే బంగ్లాదేశ్ లంక పర్యటన నేపథ్యంలో ఐపీఎల్లో ఆడేందుకు ముస్తాఫిజుర్కు 'నిరభ్యంతర పత్రం' ఇచ్చేందుకు బీసీబీ నిరాకరించింది.
అయితే ఇప్పుడు ఆ శ్రీలంక పర్యటన కూడా వాయిదా పడింది. 14 రోజుల క్వారంటైన్ నిబంధనకు బీసీబీ ససేమీరా అనడంతో శ్రీలంక బోర్డు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 24న ప్రారంభం కావాల్సింది. కానీ క్వారంటైన్కు ఆటగాళ్లు సిద్దంగా లేకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. దాంతో ముస్తాఫిజుర్ ఖాళీగా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అతను బోర్డుపై పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం బోర్డుకు ముందే తెలిసి ఉంటే ఐపీఎల్ ఆడేందుకు తనకు అనుమతివ్వాల్సిందన్నాడు. అలా చేయకపోవడంతో తాను ఒక కోటీ(రూ.87.23 లక్షలు) టాకాల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నాడు.
'టెస్ట్ సిరీస్ జరిగితే బాగుండేది. శ్రీలంక బోర్డు ప్రతిపాదించిన 14 రోజుల క్వారంటైన్ మా వల్ల కాదు. ముఖ్యమైన సిరీస్ ముందు ఖాళీగా రూమ్లో కూర్చోలేం. ఎంత శిక్షణ తీసుకున్నా సాధ్యం కాదు. బీసీబీ తన సాయశక్తులా ప్రయత్నించింది. కానీ 14 రోజుల క్వారంటైన్ అనేది నిబంధన. దాన్ని గౌరవించాల్సిందే.
ఇక శ్రీలంక ఈ టెస్ట్ సిరీస్ను వాయిదా వేస్తుందని బీసీబీకి ముందు తెలుసుంటే.. ఐపీఎల్ ఆడేందుకు నాకు ఎన్ఓసీ ఇవ్వాల్సింది. ఏదేమైనా మన మంచికే అనుకోవాలి. ఐపీఎల్ ఆడితే నేను కోటి టాకాలు సంపాదించుకునేవాడిని'అని ముస్తాఫిజుర్ క్రిక్బజ్తో తన అసంతృప్తిని వెళ్లగక్కడాడు.
ఇక 2018లో చివరిసారిగా ఐపీఎల్ ఆడిన ముస్తాఫిజుర్.. ముంబై ఇండియన్స్ తరఫున 7 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. మధ్యలో గాయమవ్వడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది కూడా అతడు ఐపీఎల్లో ఆడడానికి బంగ్లా బోర్డు నిరాకరించింది. విదేశీ లీగుల్లో ఆడితే తమ ఆటగాళ్లు అనవసరంగా గాయాలబారిన పడతారని భావించి ఆ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం లేదు.
బాప్రే.. 12 బంతుల్లో 10 యార్కర్లు ఎవరీ నటరాజన్?