ఫ్యూచర్పై ఫోకస్..
మెగా వేలంలో ముంబై అనుసరించిన విధానాలపై విమర్శలు వచ్చినా.. ఆ జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది జోఫ్రా ఆర్చర్ ఆడడని తెలిసినా.. అతన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. టీమిండియా ఫ్యూచర్ స్టార్ అయిన ఇషాన్ కిషన్ కోసం కోట్లు కుమ్మరించింది. అయితే మెగా వేలం జరిగిన ప్రతీ సీజన్లో ముంబై పేలవ ప్రదర్శన కనబర్చింది. రోహిత్ శర్మ బ్యాటింగ్ తరహాలోనే ఆ జట్టు సెటిల్ అయ్యేందుకు కొంత టైమ్ తీసుకుంటుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లను ఇంటర్నేషనల్ స్టార్లుగా మార్చుకొని సత్తా చాటుతోంది. బుమ్రా, పాండ్యా బ్రదర్స్, రాయుడు వంటి ఆటగాళ్లు ఇలా వచ్చినవారే.
ఆఫ్ సీజన్లో కూడా..
లీగ్లో ఐదు సార్లు చాంపియన్గా నిలిచిన ముంబై సక్సెస్కు ప్రధాన కారణం ఆఫ్ సీజన్లో కూడా యువ ఆటగాళ్లకు క్యాంప్లు నిర్వహించడం. ఎప్పటిలానే ఈసారి కూడా ముంబై తమ యువ ఆటగాళ్లను ఇంగ్లండ్కు పంపించి అక్కడ లాంకషైర్ టీమ్ తరఫున ఆడించనుంది. తద్వారా వారిని మరింత రాటుదేలేలా ప్రోత్సాహకం అందించనుంది. ఇంగ్లండ్లోని అగ్రశ్రేణి టీ20 క్లబ్లతో మ్యాచ్లు ఆడేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ముంబై ఇండియన్స్ అన్ క్యాప్ ప్లేయర్లంతా ఈ స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొననున్నారు.
చెలరేగుతున్న యువ ఆటగాళ్లు..
ముంబై ఇండియన్స్కు చెందిన యువ ఆటగాళ్లు ఆయా టోర్నీల్లో చెలరేగుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. సౌతాఫ్రికాకు చెందిన 21 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్ తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపాడు. ఓ మ్యాచ్లో 8 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. సఫారీకే చెందిన 19 ఏళ్ల డెవాల్డ్ బ్రేవిస్ సైతం తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక భారత్కు చెందిన యువ ఆటగాళ్లు సంజయ్ యాదవ్, కుమార్ కార్తీకేయ దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో సంజయ్ యాదవ్ 9 మ్యాచ్ల్లో 186 స్ట్రైక్రేట్తో 450 రన్స్ చేశాడు. అతను ఏకంగా 40 సిక్స్లు బాదడం విశేషం. కుమార కార్తీకేయ.. మధ్య ప్రదేశ్ రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 32 వికెట్లతో సత్తా చాటాడు.
మహా డేంజర్గా ముంబై..
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ, ఆస్ట్రేలియా స్టార్ టీమ్ డేవిడ్ ఈ సీజన్లోనే తాము ఏంటో నిరూపించుకున్నారు. తిలక్ వర్మ అన్ని ఫార్మాట్లు ఆడగల ప్లేయరని కెప్టెన్ రోహిత్ శర్మనే కితాబిచ్చాడంటే అతను ఎంతటి టాలెంటెడ్ ప్లేయరో అర్థం చేసుకోవచ్చు. విజయ్ హజారే, ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటితే తిలక్.. ఐపీఎల్ 2023 కన్నా ముందే భారత జట్టుకు ఆడవచ్చు. టీమ్ డేవిడ్ ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. అతనే గనుక ప్రపంచకప్ ఆడితే మరింత రాటుదేలుతాడు. గత సీజన్లో ఫిట్నెస్ సమస్యలతో బాధపడిన సూర్య, పెద్దగా రాణించని బుమ్రా, కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, పొలార్డ్ సత్తా చాటితే ఆ జట్టుకు తిరుగుండదు. జోఫ్రా ఆర్చర్ సైతం అందుబాటులోకి వస్తే... బౌలింగ్ విభాగం బలంగా తయారవుతోంది. ఈ కారణాలతోనే పేపర్పై ముంబై ఇతర జట్ల కన్నా అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది.