హైదరాబాద్: పూర్వపు ఫామ్ను కొనసాగిస్తోన్న ధోనీ మైదానంలోనూ మంచి జోష్ మీద కనిపిస్తున్నాడు. కెప్టెన్గా ధోనీ ప్రవర్తన జట్టులోని మిగతా ఆటగాళ్లలోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. రెండేళ్ల తర్వాత మరోసారి తనకెంతో ఇష్టమైన ఎల్లో జెర్సీలోకి వచ్చేసిన మహి.. బ్యాట్తోనూ మంచి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి సంబరాల్లోనే మునిగిపోతోన్న చెన్నై జట్టు ఆటతీరులోనూ అంతే ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ధోనీ సేన నిలకడగా ఆడుతూ.. టీమ్కు విజయాలు సాధించిపెడుతుంది.
ఎప్పుడూ కూల్గా ఉండే ధోనీ..
ఈసారి గ్రౌండ్లో తన చేష్టలతో నవ్వులు పూయిస్తున్నాడు. అలాంటిదే ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనూ జరిగింది. చెన్నై ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజాను సరదాగా భయపెట్టాడు ధోనీ. ధావన్ మిడ్వికెట్ దిశగా కొట్టిన బాల్ను పరుగెత్తుకుంటూ వెళ్లి ఆపిన ధోనీ.. డీప్ మిడ్వికెట్ నుంచి జడేజా పరుగెత్తుకు రావడాన్ని గమనించాడు. బాల్ను అతని వైపు విసిరి కొడుతున్నట్లు ధోనీ నటించాడు. అది చూసి కామెంటేటర్లతోపాటు ప్రేక్షకులంతా నవ్వుల్లో మునిగిపోయారు.
ఐపీఎల్ 2018 సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి ప్లేఆఫ్ చేరిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి రుచి చూపింది. పుణె వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఓపెనర్ అంబటి రాయుడు (100) మెరుపు సెంచరీ బాదడంతో సన్రైజర్స్పై 8 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ (79) , కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51) హాఫ్ సెంచరీలు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
MUST SEE: When @msdhoni scared @imjadeja 😁🤣#KXIPvKKR #VIVOIPLhttps://t.co/iBE3Hg8Buw pic.twitter.com/HY6J5Wu8NB
— IndianPremierLeague (@IPL) May 13, 2018
ఛేదనలో తొలి వికెట్కి రాయుడు- షేన్ వాట్సన్ (57) జోడి అభేద్యంగా 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెన్నై విజయానికి బాటలు వేయగా.. ఆఖర్లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (20)తో కలిసి రాయుడు లాంఛనాన్ని మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశాడు.