టీమిండియా యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆడకపోవడం తనకు బాధగా ఉందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. టీమ్కాంబినేషన్లో భాగంగా చివరి నిమిషంలో అతను ప్రపంచకప్ జట్టుకు దూరమయ్యాడని చెప్పాడు. జట్టుకు ఇషాన్ కిషన్ అవసరం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చాడు.
మెగా టోర్నీకి ముందు జితేష్ శర్మ స్థానంలో సెలెక్టర్లు ఇషాన్ కిషన్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్ మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 9 మ్యాచ్ల్లో 317 పరుగులు చేసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
దాదాపు రెండేళ్లు భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జార్ఖండ్ను విజేతగా నిలబెట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. శుభ్మన్ గిల్ వైఫల్యం కూడా ఇషాన్ కిషన్కు కలిసొచ్చింది. బ్యాకప్ ఓపెనర్ కమ్ వికెట్ కీపర్గా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు న్యూజిలాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో సత్తా చాటాడు.
మరోవైపు భారత జట్టు తరఫున గతేడాదిగా మెరుగైన ప్రదర్శన చేసిన జితేష్ శర్మ.. ఇషాన్ కిషన్ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో జితేష్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.

'ఇషాన్ కిషన్ సామర్థ్యాలను, అతను జట్టుకు తీసుకురాగల ప్రేరణను పరిగణలోకి తీసుకొని మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. జితేష్ స్థానంలో ఇషాన్ కిషన్ను తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను కాస్త బాధపడ్డాను. ఎందుకంటే గతేడాదిన్నరగా జితేష్ శర్మ జట్టులో ఉన్నాడు. ఫినిషర్గా తన బాధ్యతను అద్భుతంగా నిర్వహించడంతో పాటు మెరుగైన ప్రదర్శన చేశాడు. నీ మాకు టాప్ ఆర్డర్లో ఒక 'ఎక్స్-ఫ్యాక్టర్', ఫియర్-లెస్ హిట్టర్ కావాలని అనిపించింది.

ఇద్దరు ఉత్తమ వికెట్ కీపర్లలో ఒకర్ని ఎంచుకునేటప్పుడు.. ఒకరికి ఉద్వాసన తప్పదు. ఇషాన్ కిషన్ జట్టుకు ఎంపికైన వెంటనే నేను అతనికి ఫోన్ చేశాను. 'ఛోటూ, మనకు వరల్డ్ కప్ గెలిపిస్తావా?అని అడిగాను. దానికి ఇషాన్ ఏమాత్రం తడుముకోకుండా.. నన్ను నమ్ముతారా? అని తిరిగి ప్రశ్నించాడు. నేను 'నమ్ముతాను' అని చెప్పాను. ఆ నమ్మకాన్ని అతను నిజం చేశాడు.
ఇషాన్ చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. కానీ అతను ఏమాత్రం కుంగిపోకుండా దేశంలోని ప్రతి మూలకు వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్లు, డొమెస్టిక్ మ్యాచ్లు ఆడి తన ఫామ్ను నిరూపించుకున్నాడు. అతని అంకితభావం చూశాక అతనే సరైన ఎంపిక అని నాకు అనిపించింది.
టీ20 ప్రపంచకప్ 2026 జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత జితేష్ శర్మతో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. ఇది కేవలం ఒక బ్రేక్ మాత్రమేనని, మళ్లీ జట్టులోకి వస్తావని చెప్పాను. జితేష్పై నాకు గౌరవం ఉంది. గ్రౌండ్ బయట మేం ప్రాణ స్నేహితులమైనా.. టీమ్ సెలెక్షన్ దగ్గరకు వచ్చేసరికి, జట్టు ప్రయోజనలే నాకు ముఖ్యం.
ప్రస్తుతం టీమిండియాలో వికెట్ కీపర్-బ్యాటర్ స్థానానికి విపరీతమైన పోటీ ఉంది. రిషభ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్.. ఇలా అందరూ ఫామ్లో ఉన్నారు. అందుకే కాంబినేషన్ కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
