క్లబ్ క్రికెట్లాగా అనిపించింది
తాజాగా మాంటీ పనేసర్ మాట్లాడుతూ... 'మూడో టెస్టులో ఆట చూశాక అది ఇంగ్లండ్లో శనివారం ఆడే క్లబ్ క్రికెట్లాగా అనిపించింది. మేం క్లబ్ క్రికెట్ ఆడేటపుడు ప్రత్యర్థిని 100 పరుగుల్లోపే ఆలౌట్ చేస్తాం. ఎందుకంటే బంతి తిరిగే పిచ్పై ఛేదన కష్టమవుతుంది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో టెస్టు మ్యాచ్లు ఇంకా సుదీర్ఘంగా సాగాలి. పిచ్ ఎంత బాగుందో ప్రజలు చూస్తారు' అని అన్నాడు. భారత్ పడగొట్టిన 20 వికెట్లలో 19 స్పిన్నర్లే తీశారు. అక్షర్ 11, అశ్విన్ 7, సుందర్ 1 వికెట్ పడగొట్టాడు. పేసర్ ఇషాంత్ ఒక వికెట్ తీశాడు.
డబ్ల్యూటీసీ పాయింట్లలో ఐసీసీ కోత విధించాలి
'భారత్ అద్భుతమైన స్టేడియాన్ని నిర్మించింది. కానీ అలాంటి మైదానంలో రెండు రోజుల్లో, అదీ 900 బంతుల్లోనే టెస్టు ముగియడం సరికాదు. ఇలాంటి క్రికెట్ ఆడాలనుకుంటే.. ఏదో ఒక పార్కులో ఆడుకుంటే సరిపోతుంది. అదే మైదానంలో జరగనున్న నాలుగో టెస్టులో కూడా పిచ్ ఇలాగే ఉంటే.. భారత డబ్ల్యూటీసీ పాయింట్లలో ఐసీసీ కోత విధించాలి. చెన్నై పిచ్ కంటే మొతేరా పిచ్ మరీ ఘోరంగా ఉంది. ఒకవేళ స్పిన్ పిచే రూపొందిస్తే మ్యాచ్ కనీసం మూడున్నర రోజులైనా సాగుతుంది' అని మాంటీ పనేసర్ పేర్కొన్నాడు.
ఎర్రబంతి ఎలా స్పందిస్తుందో
'ఇంగ్లండ్ ఆటగాళ్లు స్పిన్ను సమర్థంగా ఆడట్లేదని అందరూ అంటున్నారు. కానీ అలిస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్ ఆ పిచ్లపై ఎలా ఆడేవాళ్లో గుర్తుచేసుకోవాలి. మూడో టెస్టులో గులాబి బంతితో ఆడడం కష్టమైందని అంటున్నారు. మరి ఈ పిచ్పై ఎర్రబంతి ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం ప్రదర్శించే భారత్కు ఆట సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది' అని మాంటీ చెప్పుకొచ్చాడు.
మొతేరాలోనే నాలుగో టెస్ట్
డేనైట్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 112 పరుగులు చేయగా.. భారత్ 145 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 81 పరుగులకే ఆలౌటవ్వడంతో.. భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టు మొతేరా స్టేడియంలో మార్చి 4న ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు.
India vs England: ఇంగ్లండ్ బలహీనతను భారత్ ముందే పసిగట్టింది.. మానసికంగా దెబ్బకొట్టింది: ఛాపెల్