|
మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ బ్యాట్స్మన్కు ఎలా ఇస్తారు?
న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్(57) , శ్రేయస్ అయ్యర్(44) తమ ఫామ్ను కొనసాగిస్తూ చెలరేగడంతో కోహ్లీ సేన సునాయస విజయాన్నందుకుంది. హాఫ్ సెంచరీ సాధించిన రాహుల్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. అయితే బ్యాట్స్మన్కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ఇవ్వడాన్ని మంజ్రేకర్ తప్పు పట్టాడు. న్యూజిలాండ్ను స్వల్ప స్కోర్కు పరిమితం చేసిన బౌలర్లదే విజయంలో కీలక పాత్ర. అవార్డు బౌలర్కు ఇవ్వాల్సిందని ట్వీట్ చేశాడు.
|
ప్లీజ్.. ప్లీజ్ ఆ బౌలర్ ఎవరో చెప్పవా?
ఇక ఈ ట్వీట్కి జడేజా స్పందిస్తూ ‘ఆ బౌలర్ పేరేంటి..? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా..?'అని అడిగాడు. దానికి మంజ్రేక్ కూడా బదులిస్తూ.. ‘హ్హ హ్హ.. ఆ అవార్డు నీకు లేదా బుమ్రాకి వచ్చి ఉండాలి. బుమ్రాకి ఎందుకంటే.. అతను వేసిన 3, 10, 18, 20 ఓవర్లలో తక్కువ పరుగులిచ్చాడు' అని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశాడు. దీంతో వీరు స్నేహపూర్వకంగా మెలుగుతున్నట్లు స్పష్టమైంది.
ఇక ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన జడేజా 4.50 ఎకానమీతో 18 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ రెండు వికెట్లు కూడా 11 ఓవర్లోనే దక్కడం విశేషం. పైగా న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్, కొలిన్ గ్రాండ్ హోమ్లవి కావడం మరో విశేషం.ఇక బుమ్రా 5.25 ఎకానమీతో 21 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. విజయంలో వీరిద్దరిదే కీలక పాత్ర అని తెలిపిన మంజ్రేకర్ వీరికే అవార్డు దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు.
అప్పుడేం జరిగిందంటే..
వరల్డ్ కప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకునే ప్రయత్నంలో కేఎల్ రాహుల్ గాయ0.. అతని స్థానంలో జడేజా సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే లాంగాన్లో జేసన్ రాయ్ ఇచ్చిన కష్టమైన క్యాచ్ను జడేజా అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ అందుకున్నాడు.
దీంతో.. ఈ క్యాచ్ను జడేజా తప్ప టీమిండియాలో ఎవరూ పట్టలేరంటూ.. ఇంగ్లండ్కు చెందిన కామెంటేటర్ వ్యాఖ్యానించగా.. పక్కనే ఉన్న మంజ్రేకర్ భిన్నంగా స్పందించాడు. ‘అరకొరగా మ్యాచ్లు ఆడే ఆటగాళ్లని నేను పెద్దగా అభిమానించను. వన్డేల్లో జడేజా ఆ కోవకి చెందిన క్రికెటరే. టెస్టుల్లో మాత్రమే జడేజా బౌలర్. కానీ.. వన్డేల్లో మాత్రం అతను బ్యాట్స్మెన్ కాదు.. అలా అని స్పిన్నర్ కూడా కాదు. అరకొర ఆటగాడు' అని ఎద్దేవా చేశాడు.
|
గౌరవించడం నేర్చుకో..
మంజ్రేకర్ మాటలపై జడేజా ఘాటుగా స్పందించాడు. ‘కెరీర్లో నువ్వు ఆడిన మ్యాచ్లకంటే నేను డబుల్ ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నాను. ఫస్ట్ ఆటగాళ్లని గౌరవించడం నేర్చుకో. నేను ఇప్పటికే నీ వెటకార కామెంట్లు చాలా విన్నా. నీ నోటి విరోచనాలు ఇకనైనా ఆపితే మంచిది' అని హెచ్చరించాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జడేజా.. టీమిండియాని గెలిపించేంత పనిచేశాడు. కానీ.. ఆఖర్లో అతనితో పాటు ధోని కూడా రనౌటవడంతో భారత్ జట్టుకు పరాజయం తప్పలేదు. అయితే.. జడేజా అద్భుత ఇన్నింగ్స్కు మాత్రం అందరి నుంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో.. అరకొర ఆటగాడనే తన వ్యాఖ్యల్ని జడేజా తన ప్రదర్శనతో పీస్ పీస్ చేసేశాడంటూ అప్పట్లో మంజ్రేకర్ వివరణ ఇచ్చుకున్నాడు.