
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు చేధు అనుభవం ఎదురైంది. ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా... సిరాజ్ విలువైన బ్యాగ్ ఒకటి మిస్సయ్యింది. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం స్వదేశానికి పయనమైన సిరాజ్.. ఢాకా నుంచి ఢిల్లీ మీదుగా ముంబై చేరుకున్నాడు. అయితే తన మూడు బ్యాగుల్లో ఒక బ్యాగ్ మిస్సయ్యిందని సిరాజ్ ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియజేస్తూ.. ఎయిర్లైన్స్కు ఫిర్యాదు చేశాడు.
తన బ్యాగ్ పోయి 24గంటలు గడిచిందని, ఇప్పటి వరకు అది తనకు లభించలేదని ట్వీట్ చేశాడు. దాంతోనే ఎయిర్ లైన్స్ కి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. 'నేను 26వ తేదీన వరుసగా UK 182, UK 951 విమానంలో ఢాకా నుంచి ఢిల్లీ మీదుగా ముంబైకి ప్రయాణించాను. నేను మూడు బ్యాగ్లతో చెక్ ఇన్ అయ్యాను. వాటిలో 1 మిస్ అయ్యింది. కొద్దిసేపటిలో బ్యాగ్ కనుగొని డెలివరీ చేస్తామని ఎయిర్ లైన్స్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
నా ముఖ్యమైన వస్తువులు అన్నీ ఆ బ్యాగ్ లోనే ఉన్నాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి, హైదరాబాద్లో నాకు వీలైనంత త్వరగా బ్యాగ్ను డెలివరీ చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను." అంటూ ఎయిర్ విస్తారాను ట్యాగ్ చేస్తూ సిరాజ్ విజ్ఞప్తి చేశాడు. సిరాజ్ ట్వీట్కు స్పందించిన ఎయిర్ విస్తారా.. తమ సిబ్బంది త్వరలోనే లగేజ్ వెతికి మీకు అందజేస్తారని బదులిచ్చింది. ఈ ఘటనతో విస్తారా ఎయిర్లైన్స్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో జట్టుకు దూరమవడంతో టీమిండియాలోకి వచ్చిన సిరాజ్.. వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో సత్తా చాటిన సిరాజ్.. శ్రీలంకతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. స్వదేశంలో వచ్చేనెల 3 నుంచి 7 వరకు టీ20లు.. 10 నుంచి 15 వరకు వన్డే సిరీస్ జరుగనుండగా.. ఈ సిరీస్లకు సంబంధించిన వేర్వేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. టీ20 సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు కట్టబెట్టిన బీసీసీఐ.. వన్డే వైస్ కెప్టెన్సీ పదవి నుంచి రాహుల్ను తప్పించి హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ ఇచ్చింది. గాయంతో బంగ్లాదేశ్ పర్యటనకు దూరమైన రోహిత్.. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.