కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం అత్యుత్తమ బ్యాట్స్మన్ అని, ఇప్పటికే అందుకోవాల్సిన ఘనతనలన్నిటీ అందుకున్నాడని కొనియాడాడు. ప్రస్తుతం అతడు సంధికాలంలో ఉన్నాడని.. త్వరలోనే తిరిగి అన్ని ఫార్మాట్లలో సెంచరీల జోరు చూపిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.
అయితే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో విరాట్ కోహ్లీ పోల్చడం మాత్రం సరికాదన్నాడు.
'సచిన్ టెండూల్కర్ దిగ్గజ ఆటగాడు. 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. ఎలాంటి బౌలర్లను ఎదుర్కొన్నాడో అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.'అని తాజాగా పీటీఐకి ఇంటర్వ్యూలో యూసుఫ్ చెప్పుకొచ్చాడు.ఇండియాలో ఇప్పటికీ టెక్నిక్తో బ్యాటింగ్ చేసే క్రికెటర్లు పుట్టుకొస్తున్నారని ఈ పాక్ మాజీ బ్యాటింగ్ దిగ్గజం ప్రశంసించాడు. ప్రతి తరానికి ఒక రోల్ మోడల్ తయారవుతున్నాడని కొనియాడాడు. ఒకరిని ఒకరు అనుసరిస్తున్నారని తెలిపాడు. 'ఇంజమామ్ ఉల్ హక్, సయ్యద్ అన్వర్ వంటి దిగ్గజాల హయాంలో ఆడిన నేనెంతో అదృష్టవంతుడిని' అని యూసుఫ్ పేర్కొన్నాడు.
ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడైన కోహ్లీ.. 2019 నుంచి ఏ ఫార్మాట్లోనూ మూడంకెల స్కోరు అందుకోలేకపోతున్నాడు. దీనిపై యూసుఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రస్తుతం కోహ్లీ వయసు 32. ఇది అతనికి మంచి సమయమని చెప్పొచ్చు. ప్రస్తుతం సంధికాలంలో ఉన్నాడు. త్వరలోనే తిరిగి అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేస్తాడు. నాకు తెలిసి విరాట్ ఇప్పటికే.. అందుకోవాల్సిన ఘనతలన్నీ సాధించాడు. వన్డే, టెస్టుల్లో కలిపి ఇప్పటికే 70 సెంచరీలు చేశాడు."'అని తెలిపాడు.