భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెండూల్కర్ సలహాలతోనే తాను ఫామ్ అందుకున్నానని సంజూ శాంసన్ తెలిపాడు. గత కొన్ని నెలలుగా సచిన్ సార్తో నిరంతరం టచ్లో ఉన్నానని చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడో టీ20 ప్రపంచకప్ను ముద్దాడటంతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్గా టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా.. సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన టీమ్గా చరిత్ర సృష్టించింది.
ఈ ఫైనల్లోనూ సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89) అదరగొట్టాడు. వెస్టిండీస్తో క్వార్టర్ఫైనల్ వంటి సూపర్-8 మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ.. ఇంగ్లండ్తో 86 పరుగులతో సత్తా చాటాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ అందుకున్నాడు. పేలవ ఫామ్తో టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు కోల్పోయిన సంజూ శాంసన్.. కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతన్ని ఓపెనర్గా ఆడించగా.. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు.

ప్రపంచకప్ విజయానంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన సంజూ శాంసన్.. ఇదంతా ఆ దేవుడి ప్రణాళిక అని చెప్పుకొచ్చాడు. సచిన్ సార్ సలహాలతోనే ఫామ్ అందుకున్నానని తెలిపాడు. 'ఈ విజయం.. అవార్డ్ ఒక కలలా అనిపిస్తోంది. చాలా సంతోషంగా.. కృతజ్ఞతగా ఉన్నాను. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. నా భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నాను.
వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేయడం, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవాలనే కోరిక రెండేళ్ల క్రితమే మొదలైంది. నేను ఆడని 2024 ప్రపంచకప్ జట్టులో ఉన్నప్పుడు.. నేను ఇలా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని నిరంతరం ఊహించుకునేవాడిని. అందుకు తగ్గట్లు కష్టపడేవాడిని. చివరకు ఆ దేవుడి దయతో నా కల సాకారమైంది.

న్యూజిలాండ్ సిరీస్ తర్వాత నేను పూర్తిగా కుంగిపోయాను. నా కలలు పూర్తిగా చెదిరిపోయాయి. 'నేను ఇంకేమి చేయగలను' అని ఆలోచించాను. కానీ దేవుడి ప్రణాళికలు వేరేలా ఉన్నాయి. కలలు కనే ధైర్యం చేసినందుకు నాకు ఈ ప్రతిఫలం దక్కింది. చాలా మంది మాజీ ఆటగాళ్లు నన్ను సంప్రదించి సహాయం చేయడానికి ప్రయత్నించారు. గత కొన్ని నెలలుగా నేను సచిన్ సార్తో నిరంతరం టచ్లో ఉన్నాను. నేను ఆయన్ని సంప్రదించాను. మా మధ్య పెద్ద పెద్ద సంభాషణలు జరిగాయి.
ఆయన వంటి వ్యక్తి నుంచి మార్గదర్శకత్వం పొందడం కంటే ఇంకేం కావాలి? నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ విజయం నాకు చాలా పెద్దది. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచిస్తాను.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేయగా.. న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌటైంది.
