న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాభావాన్ని అధిగమించి సిరీస్లో ముందుకు సాగాలంటే టీమిండియా ఆటగాళ్లంతా ఫోన్లు స్విచ్చాఫ్ చేయాలని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ముందుకు సాగాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 36 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలోనే 'కోహ్లీసేన' భారత్ తరఫున అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. అనంతరం ఆసీస్ 90 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో నాలుగు టెస్ట్ల సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫస్ట్ టెస్టు అనంతరం భారత్కు తిరిగి వస్తున్న విషయం తెలిసిందే. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో అనుష్క పక్కన ఉండాలనకున్న కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు.
కోహ్లీ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ అజింక్య రహానే జట్టును నడిపించనున్నాడు. అయితే, పింక్బాల్ టెస్టు ఘోరపరాభవం తర్వాత అతను జట్టును ఎలా నడిపిస్తాడనేదే కీలకంగా మారింది. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించిన కైఫ్.. ప్రస్తుత పరిస్థితుల్లో రహానే భారత జట్టును ఏకతాటిపైకి తేవాలని సూచించాడు. దాంతో తిరిగి జట్టులో ఉత్సాహం నింపి మున్ముందు తన మార్క్ కెప్టెన్సీని ప్రదర్శించాలని కోరాడు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ను రెండో టెస్టులో ఆడించాలన్నాడు.
'ఫోన్లను స్విచ్చాఫ్ చేయండి. ఈ విమర్శలను పక్కనపెట్టి జట్టుగా ఒకతాటిపైకి రండి. ఈ ఘోరపరాభావాన్ని అధిగమించాలంటే భారత్ ముందున్న ఏకైక మార్గం ఇదే. రహానే జట్టులో ఉత్సాహాన్ని నింపి తన కెప్టెన్సీ సత్తాను చాటాలి'అని కైఫ్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా, ఈనెల 26 నుంచి మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.