ఆస్ట్రేలియాతో ఏకైక పింక్ బాల్(డే/నైట్) టెస్ట్లో భారత మహిళల జట్టుకు శుభారంభం దక్కలేదు. బౌలర్ల హవా నడిచిన తొలి రోజు ఆటలో భారత బ్యాటర్లు తేలిపోయారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 62.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. దాదాపు 20 నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కోలేక తీవ్రంగా ఇబ్బంది పడింది.

జెమీమా రోడ్రిగ్స్(84 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. షఫాలీ వర్మ(48 బంతుల్లో 6 ఫోర్లతో 35), కాశ్వీ గౌతమ్(54 బంతుల్లో 3 ఫోర్లతో 34 నాటౌట్) పర్వాలేదనిపించారు. స్మృతి మంధాన(4), ప్రతికా రావల్(18), హర్మన్ప్రీత్ కౌర్(19), దీప్తి శర్మ(7), రిచా ఘోష్(11), స్నేహ్ రాణా(5), సయాలి సత్ఘరే(7), క్రాంతి గౌడ్(1) తీవ్రంగా నిరాశపర్చారు. ఆసీస్ ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు వదిలేసి భారత జట్టుకు కొంత మేలు చేశారు. అనాబెల్ సదర్లాండ్ 4 వికెట్లు పడగొట్టగా.. తొలి టెస్ట్ ఆడుతున్న లూసీ హామిల్టన్కు 3 వికెట్లు దక్కాయి.

అనంతరం ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 27 ఓవర్లలో 3 వికెట్లకు 96 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ(62 బంతుల్లో 7 ఫోర్లతో 43 బ్యాటింగ్), అనాబెల్ సదర్లాండ్(20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న అలీసా హీలీ(13) తీవ్రంగా నిరాశపర్చింది. భారత బౌలర్లలో సయాలీ సత్ఘరేకు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా 102 పరుగులు వెనుకంజలో ఉంది.
ఈ మ్యాచ్తో భారత్ జట్టు తరఫున ఒకేసారి నలుగురు ప్లేయర్లు టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. కాశ్వీ గౌతమ్, క్రాంతి గౌడ్, ప్రతీక రావల్, సమయాలీ సత్ఘరేలు ఈ మ్యాచ్తో టెస్ట్ కెరీర్ ప్రారంభించారు. వరుసగా 95, 96, 97, 98వ టెస్ట్ క్యాప్స్ అందుకున్నారు.
