మీడియా మద్దతు అవసరం..
భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ మాత్రం భిన్నంగా స్పందించింది. మీడియాకు దూరంగా ఉండాలని తానెప్పుడూ అనుకోలేదని తెలిపింది. ప్రస్తుత రోజుల్లో మహిళల క్రికెట్కు ఆదరణ దక్కాలంటే మీడియా మద్దతు ఎంతో అవసరమని స్పష్టం చేసింది. 'క్వారంటైన్లో ఉండటం క్రీడాకారులకు ఎంత ఇబ్బందో నాకు తెలుసు. కానీ, మైదానంలోకి దిగాక ఇలాంటివి పక్కన పెట్టాలి. మీడియా విలువెంటో నాకు తెలుసు కాబట్టే నేనింత వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ను దూరంగా ఉండలేదు. ప్రస్తుత రోజుల్లో మహిళా క్రికెట్కు ఆదరణ దక్కాలంటే మీడియా మద్దతు అవసరం."అని మిథాలీ చెప్పుకొచ్చింది.
నవోమికి హగ్ ఇవ్వాలనుకుంటున్నా..
అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మాత్రం ఒసాకాకు మద్దతు ప్రకటించింది. దీనిపై సోమవారం తన తొలి రౌండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత సెరెనా స్పందించింది. 'ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చే ముందే నాకు ఈ విషయం తెలిసింది. ఆమెకు ఓ హగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎలాంటి పరిస్థితో నాకు తెలుసు. నేను కూడా గతంలో ఇలాంటివి అనుభవించాను'అని సెరెనా చెప్పుకొచ్చింది. పరిస్థితులను ఒక్కొక్కరు ఒక్కోలా ఎదుర్కొంటారని, అందరూ ఒకేలా స్పందించాలని లేదని, ఈ పరిస్థితిని ఆమె ఎలా హ్యాండిల్ చేస్తోందో అలానే చేయనివ్వండని సెరెనా స్పష్టం చేసింది.
నిర్వాహకుల తీరుతో..
ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్లో విజయానంతరం మీడియా సమావేశానికి హాజరుకాకపోవడం వల్ల ఒసాకాకు రిఫరీ 15,000 డాలర్ల జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి చెందిన ఒసాకా టోర్నీ నుంచి వైదొలిగింది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు తాను ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా మీడియాతో మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. 2018 యూఎస్ ఓపెన్ నుంచి తాను మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు, అందుకే తప్పుకొంటున్నట్లు ట్వీట్ చేసింది.