న్యూఢిల్లీ: 2017 ప్రపంచకప్ సాధించి ఉంటే ఆ క్షణమే కెరీర్ ముగించే దాన్ని అని భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. కానీ అలా జరగలేదని, ఇన్నేళ్ల తన సుదీర్ఘ కెరీర్లో ప్రపంచకప్ గెలవకపోవడం లోటుగా ఉందని ఈ హైదరాబాద్ స్టార్ చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్క్పను గెలచుకోవడంపైనే తన దృష్టంతా ఉందన్న మిథాలీ.. అందుకే ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచనేమీ లేదని స్పష్టం చేసింది. గతంలో మూడు పర్యాయాలు టైటిల్కు సమీపంగా వచ్చినప్పటికీ అనుకున్నది సాధించలేకపోయామని ఆమె వ్యాఖ్యానించింది. అందరి ఆశీర్వాదాలతో ఈసారి వరల్డ్కప్ సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.
'2013లో జరిగిన టోర్నీలో మేం కనీసం సూపర్ సిక్స్కు కూడా అర్హత సాధించలేదు. అప్పుడు నేను చాలా నిరాశ చెందాను. 2017లో ప్రయత్నిద్దాం అనుకున్నాను. ఓ ప్లేయర్గా, కెప్టెన్గా చాలా కష్టపడ్డాను. అందుకే ఫైనల్లో గెలిచాక గుడ్బై చెబుదామనుకున్నా. అప్పుడు కూడా ఫలితం రాలేదు. అందుకే 2021లో మరో చాన్స్ తీసుకుందామనుకుంటున్నాను.
మరోసారి ప్రయత్నిద్దామని గట్టిగా నిశ్చయించుకున్నా. దేవుడి దయవల్ల ఈసారి సాధిస్తామని నమ్ముతున్నా' అని 37 ఏళ్ల మిథాలీ తెలిపింది. మరోవైపు మహిళల క్రికెట్ 2006లో కాకుండా మరో ఐదేళ్ల ముందే బీసీసీఐ కిందకు వచ్చుంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవని అభిప్రాయపడింది. మహిళల క్రికెట్ ఆలస్యంగా బీసీసీఐ పరిధిలోకి రావడంతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది ప్రతిభగల అమ్మాయిలు క్రికెట్కు దూరమయ్యారని తెలిపింది.
మిథాలీ కెప్టెన్సీలో టీమ్ రెండు సార్లు వరల్డ్కప్కు చేరువగా వచ్చింది. 2017 ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన భారత్.. 2018 టీ20 ప్రపంచకప్ సెమీస్లో ఓడింది. 2017 వరల్డ్క్పలో మిథాలీ సేన ఫైనల్కు చేరడంతో దేశంలో మహిళల క్రికెట్కు ఆదరణ పెరిగింది.