
లండన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమే ఆగమాగమైంది. పూర్తిగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది. ఆటలన్నీ బందయ్యాయి. ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ ఆగమ్యగోచరంగా తయారైంది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రాణాంతక వైరస్తొ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్పై బీసీసీఐ ఎటు తేల్చుకోలేకపోతుంది. ముందు చూస్తే నొయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్నట్లు తయారైంది క్రికెట్ పెద్దన్న పరిస్థితి.
ప్రస్తుత కరోనా కలవరపెడుతుంటే.. భవిష్యత్తులో ఎఫ్టీపీ అడ్డురానుంది. దీంతో ఏం చేయాలో తెలియక బీసీసీఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సీజన్ రద్దు చేద్దామా అంటే ఊహించని నష్టం వాటిల్లనుంది. ప్రస్తుతం ఎటు తేల్చుకోలేకపోతున్న బీసీసీఐ.. పరిస్థితిలు చక్కబడిన తర్వాత ఓ నిర్ణయానికి రావాలని భావిస్తుంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ఐపీఎల్ నిర్వహణ విషయంలో బీసీసీఐకి అద్భుతమైన సలహా ఇచ్చాడు.
కరోనా నియంత్రణలోకి వస్తే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముందు ఐదు వారాల ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందని మైఖెల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం క్రికెట్ టోర్నీలేవీ లేకపోవడంతో మెగాటోర్నీ సన్నాహకంగా ఐపీఎల్ ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.
'నాదో ఆలోచన.. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ముందు ఐదు వారాల ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుంది. మెగాటోర్నీకి ముందు ఆటగాళ్లందరూ దీనిని సన్నాహకంగా ఉపయోగించుకుంటారు. ప్రపంచకప్ ముందు ఇదెంతో కీలకం' అని వాన్ ట్వీట్ చేశాడు.
అతడి ఆలోచన ప్రకారమైతే ఐపీఎల్ సెప్టెంబర్లో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్లో భారత్ ఆసియాకప్లో ఆడాల్సి ఉంది. అలాగే ఇంగ్లండ్ భారత్కు వచ్చి కోహ్లీసేనతో మూడు వన్డేలు, మూడు టీ2లు ఆడాలి.
'భారత్లో సెప్టెంబర్లో రుతుపవనాలు వస్తాయి. ముంబయి నగరమంతా నీటితో నిండిపోతుంది. చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తాయి. అప్పుడు ఐపీఎల్ నిర్వహణ కష్టమే' అని బీసీసీఐలోని ఓ సీనియర్ అధికారి అన్నారు. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించడం గురించి అడగ్గా 'పరిస్థితి రేపెలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కరోనా కేసులు తగ్గి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ఆశిద్దాం. అప్పుడు అవకాశాల గురించి ఆలోచించాలి' అని ఆ అధికారి పేర్కొన్నారు.