బుద్ది లేకుండా వ్యవహరించాడు..
బుద్దిలేని పనితో ఆటగాళ్లందరినీ రిస్క్లో పడేసిన జోఫ్రా ఆర్చర్ పై తనకు ఏమాత్రం సానుభూతి లేదని హోల్డింగ్ అన్నాడు. ‘బయో సెక్యూర్ ప్రోటోకాల్స్ ఉల్లంఘించిన జోఫ్రా ఆర్చర్పై నాకెలాంటి సానుభూతి లేదు. అయినా అతను ఎందుకు అలా బుద్దిలేకుండా వ్యవహరించాడో నాకు అర్థంకావడం లేదు. త్యాగం అంటే నెల్సన్ మండేలాది. అతను 27 ఏళ్లు ఓ చిన్నసెల్లో ఎలాంటి తప్పిదం చేయకుండా ఉన్నాడు. కానీ ఆర్చర్ కొద్ది రోజులు బయోబబుల్లో ఉండలేకపోయాడు.'అని హోల్డింగ్ స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ అన్నాడు.
కార్లలో ఎందుకు..?
ఇక ఈసీబీ కూడా ఇక్కడ తెలివి లేకుండా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్ద విధించిన బయో సెక్యూర్ నిబంధనలే లాజిక్ లేకుండా ఉన్నాయన్నాడు. అసలు ఇంగ్లండ్ ఆటగాళ్లను కార్లలో వెళ్లేందుకు ఎందుకు అనుమతిచ్చారని ప్రశ్నించాడు. ‘ఈ బయో సెక్యూర్ నిబంధనలపై ఈసీబీని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను.
ఇంగ్లండ్ జట్టులోని అందరికీ కరోనా నెగటివ్ అని ఇటీవల రిపోర్ట్ వచ్చింది. మరి టీమ్ మొత్తాన్ని బస్సులో మాంచెస్టర్కి తరలించొచ్చు కదా..? వ్యక్తిగత కారులో వెళ్లేందుకు క్రికెటర్లకి ఎందుకు అనుమతిచ్చారు..? ఆ దిశగా కాస్త ఈసీబీ ఆలోచించి ఉండాల్సింది. లాజిక్తో ఉన్న నిబంధనలు పెట్టాల్సింది'అని హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు.
ఇంటికి వెళ్లి వచ్చిన ఆర్చర్
ఈ టెస్టు సిరీస్లో ఆటగాళ్లు, సిబ్బంది అంతా జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను వాడుతున్నారు. మ్యాచ్ వేదికల్లో మాత్రమే ఇవి పని చేస్తాయి. అయితే తొలి టెస్టు ముగిసిన సౌతాంప్టన్ నుంచి రెండో టెస్టు జరిగే మాంచెస్టర్ వరకు ఆటగాళ్లు విడివిడిగా ప్రయాణించేందుకు అనుమతించారు. ఇదే దారిలో ఉన్న ‘బ్రైటన్'లో ఆర్చర్ ఫ్లాట్ ఉంది. అతను సుమారు గంట సేపు తన ఇంటికి వెళ్లినట్లు బయటపడింది. అయితే అక్కడ ఉన్నంత సేపు ఎవరితోనూ సన్నిహితంగా మెలగలేదని, సొంతిల్లు సహజంగానే సురక్షితం కాబట్టి ప్రమాదం ఉండదని ఆర్చర్ భావించినట్లు అతని సన్నిహితుడొకరు తెలిపారు.
రూ.190 కోట్ల ఆదాయంపై..
ఇక నిబంధనల ప్రకారం ఆర్చర్ ఇప్పుడు ఐదు రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో అతనికి రెండు సార్లు కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారు. రెండు సార్లు కూడా నెగిటివ్గా తేలితేనే జట్టుతో చేరేందుకు అనుమతిస్తారు. కరోనావైరస్ బారిన పడకుండా ఈ టెస్టు సిరీస్ను విజయవంతంగా నిర్వహించడంలో ఇంగ్లండ్ బోర్డు తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. కఠిన నిబంధనలతో కూడిన ‘బయో బబుల్' వివరాలు వెల్లడించిన తర్వాతే ఇంగ్లండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో టెస్టుపై సుమారు రూ. 190 కోట్లు ఆదాయం ముడిపడి ఉంది. ఇలాంటి స్థితిలో నిబంధనలు ఉల్లంఘించడం తీవ్రమైన తప్పుగా ఈసీబీ పరిగణించింది.