భువనేశ్వర్: ఒలింపిక్స్ శిక్షణ ఖర్చుల కోసం తన బీఎండబ్ల్యూ లగ్జరీ కారును అమ్ముతున్నట్లు భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించడం ఒడిశాలో ప్రకంపనలు రేపుతోంది. తీవ్ర విమర్శల నేపథ్యంలో ద్యుతీ ఆ పోస్ట్ను తొలగించినా.. లగ్జరీ కారు నిర్వహణ తనవల్ల కాకపోవడం వల్లే దాన్ని అమ్మకానికి పెట్టినట్టు మాట మార్చినా ఈ వివాదం మాత్రం సద్దుమణగడంలేదు.
ఇక తాజాగా ఒడిశా యువజన క్రీడాశాఖ ద్యుతీ పోస్ట్పై ఘాటుగానే స్పందించింది. ఒడిశా సర్కారు ద్యూతీకి అందించిన ఆర్థిక సాయం వివరాలను గురువారం అధికారికంగా విడుదల చేసింది. 2015 నుంచి ఇప్పటిదాకా ఆమెకు 4.09 కోట్లు నగదు రూపంలో అందించినట్టు ప్రకటించింది. దీంతో పాటు ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ)లో గ్రూప్-ఏ లెవల్-1 అధికారిణిగా ఉద్యోగం కల్పించామని పేర్కొంది. ఆమె పని చేయకుండా ఇంటివద్దనే ఉంటున్నా.. నెలకు రూ. 84,604 జీతంగా ఇస్తున్నట్టు తెలిపింది.
ద్యుతీకి శిక్షణ నిమిత్తం తొలుత రూ.30 లక్షలు, 2018లో ఆసియా క్రీడల్లో పతకాలు నెగ్గినప్పుడు రూ.3 కోట్లు, ఆ తర్వాత ఒలింపిక్స్ సన్నద్ధత కోసం రూ.50 లక్షలు అందించినట్టు ఆ రాష్ట్ర క్రీడాశాఖ స్పష్టం చేసింది. ఇక దీనిపై ద్యుతీ కూడా స్పందించింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు సరైనవి కావని తెలిపింది.
'సింధు పతకం సాధిస్తే నిబంధనల ప్రకారం పతకానికి ఎంతిచ్చారో నాకూ అలాగే రూ.3 కోట్లు ఇచ్చారు. ఈ మొత్తాన్ని ప్రత్యేక శిక్షణకు ఇచ్చే ఆర్థిక సహకారంతో ఎలా కలుపుతారో అర్థం కావడం లేదు. నేను ఓఎంసీ కార్యాలయానికి వెళ్లి పనిచేయకపోయినా మైదానంలో కష్టపడి పతకం గెలిచి ఆ సంస్థకు పేరు తీసుకొస్తున్నా' అని ద్యూతీ చెప్పింది. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఓఎంసీ నుంచి తనకు వస్తున్న జీతం రూ. 80 వేలు కాదని రూ. 60 వేలేనని తెలిపింది.
గాబ్రియెల్కు గజ్జలో గాయం.. తడబడి నిలబడిన ఇంగ్లండ్!