టెస్టులు వైట్వాషే
మైకేల్ క్లార్క్ మంగళవారం స్కై స్పోర్ట్స్ రేడియోలో మాట్లాడుతూ... 'వన్డేలు, టీ20ల్లోనే విరాట్ కోహ్లీ భారత జట్టును ముందుండి నడిపించగలడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ను గెలిపించి.. తొలి టెస్ట్ తర్వాత అతను వెళ్లిపోతే మిగతా టెస్ట్ సిరీస్లో కోహ్లీసేన మంచి ప్రదర్శన చేయగలదు. వన్డేలు, టీ20లు గెలవకపోతే.. టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా గెలవలేదు' అని అన్నాడు. 2018-19లో కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాను 2-1తో టెస్టుల్లో కోహ్లీసేన చిత్తు చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
బుమ్రా కూడా అలా చేయాలి
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించనున్నాడని మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. 'బుమ్రా చాలా వేగంగా బౌలింగ్ చేస్తాడు. అతని యాక్షన్ కూడా భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియా బ్యాటర్లపై చాలా దూకుడుగా బౌలింగ్ చేయాలి. స్టీవ్ స్మిత్ లాంటి బ్యాట్స్మన్కు కూడా షార్ట్ బాల్ వేయాలి. యాషెస్లో జోఫ్రా ఆర్చర్.. స్మిత్కు ఎలా బౌలింగ్ చేశాడో బుమ్రా కూడా అలా చేయాలి' క్లార్క్ సూచించాడు. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు టీమిండియాకు కీలకం అని, వారి ప్రదర్శనపైనే భారత్ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయన్నాడు. 2017-18 యాషెస్ సిరీస్లో స్మిత్ 687 రన్స్ చేశాడు. దాంతో ఆసీస్ 4-0 సిరీస్ గెలిచింది.
పితృత్వ సెలవులు
నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్లని భారత్ ఆడనుంది. తొలి టెస్టు ముగిసిన వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ వచ్చేయనున్నాడు. జనవరిలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని విరాట్ ఆశిస్తున్నాడు. బీసీసీఐ కూడా అతనికి పితృత్వ సెలవుల్ని కేటాయించింది. పితృత్వ సెలవులపై కోహ్లీ ఆసీస్తో చివరి మూడు టెస్టులకు దూరమవ్వడం భారత జట్టుకు తీరని లోటని మాజీలు అందరూ అంటున్నారు.
స్మిత్ హెచ్చరిక
మరోవైపు భారత బౌలర్లను ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ కూడా హెచ్చరించాడు. 'గత రెండు మూడు రోజులుగా నేను టచ్లోకి వచ్చా. నేను మునపటి లయను అందుకున్నా. గతంలో లాగా అలవోకగా షాట్లు ఆడుతున్నా. నేను ప్రయత్నించే ప్రతీ షాట్ క్లిక్ అవుతుంది. ఇది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అయితే కరోనా కారణంగా ఎక్కువ కాలం బ్యాటింగ్ చేయలేదు. దాంతో ఐపీఎల్లో నేను పెద్దగా రాణించలేకపోయాను. అయితే మళ్లీ ఇప్పుడు మంచి రిథమ్ అందుకున్నా. ఐపీఎల్లో దూరమైంది ఇప్పుడు నాకు దక్కినట్లుగా ఉంది' అని పేర్కొన్నాడు.