
హైదరాబాద్: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో గాలే గ్లాడియేటర్స్కు సారథ్యం వహిస్తున్న పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది సోమవారం శ్రీలంక వెళ్లాల్సిన ఫ్లయిట్ మిస్సయ్యాడు. దీంతో ఎల్పీఎల్లో ఆరంభ మ్యాచ్కు దూరమయ్యాడు. గాలే తలపడే తొలి మ్యాచ్కు ఆఫ్రిది అందుబాటులో లేకుండా పోయాడు. ఎందుకంటే.. అఫ్రిది లంక చేరుకున్నాక తప్పనిసరిగా క్వారంటైన్కు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో గ్లాడియేటర్స్ ఆడే తొలి మ్యాచులకు అందుబాటులో ఉండడం కష్టమే.
'ఈ రోజు ఉదయం కొలంబోకు వెళ్లాల్సిన ఫ్లయిట్ మిస్సయ్యాను. అయినప్పటికీ చింతించాల్సిన పనిలేదు. త్వరలోనే అక్కడికి చేరుకొని ఎల్పీఎల్లో గాలే గ్లేడియటర్స్ జట్టులో చేరతాను' అని షాహిద్ ఆఫ్రిదీ ట్వీట్ చేశాడు. ఆఫ్రిదీ ట్వీట్కు కొందరు బెస్ట్ విషెస్ చెబుతూ కామెంట్లు పెట్టగా.. మరికొందరు మాత్రం ఫ్లయిట్ మిస్సయినందుకు ట్రోల్ చేస్తున్నారు. 'సమయానికి వెళ్లండి.. మంత్రి అయినప్పుడు ఫ్లయిట్ మీ కోసం వేచి ఉంటుంది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఎల్ఎస్ఎల్లో పాల్గొనవద్దని దేవుడు పరోక్షంగా చెప్పాడు. అక్కడికి వెళ్లి కూడా నువ్ డకౌట్ అవ్వాల్సిందే. అనవసరంగా రవాణా, బోర్డింగ్ ఖర్చు వృథా అవుతుంది కాబట్టి ఇంట్లోనే ఉండండి' అని మరొకరు ట్వీట్ చేశారు.
గాలే గ్లేడియటర్స్ కెప్టెన్గా పాకిస్థానీ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ను నియమించింది. అయితే న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కావడంతో.. అతడు ఎల్పీఎల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో గాలే ఫ్రాంచైజీ ఆఫ్రిదీని కెప్టెన్గా నియమించింది. ఇక స్థానిక ఆటగాడు భనుక రాజపక్సను వైస్ కెప్టెన్గా నియమించింది. క్వారంటైన్ కారణంగా అఫ్రిది మ్యాచ్లకు అందుబాటులో లేకుంటే భనుక రాజపక్స జట్టుకు సారథ్యం వహిస్తాడు.
ఐపీఎల్ తరహాలో తొలిసారి లంక ప్రీమియర్ లీగ్ను నిర్వహించబోతున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు ఉంటాయి. నవంబర్ 26 నుంచి ఎల్పీఎల్ 2020 ప్రారంభం కానుంది. గాలే గ్లేడియేటర్స్ నవంబర్ 27న జాఫ్నా స్టాలియన్స్తో తలపడనుంది. బయో సెక్యూర్ బబుల్లో చేరడం కోసం ఆఫ్రిదీ మూడు రోజులపాటు ఐసోలేటెడ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఇటీవలే ముగిసిన పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆఫ్రిదీ ముల్తాన్ సుల్తాన్ తరఫున బరిలో దిగాడు.