సచిన్ ఔట్ చేయడం చాలా కష్టం..
ద్రవిడ్, సంగక్కరా, బ్రియాన్ లారాలు తమ ప్రత్యేకమైన ఆట తీరుతో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరినప్పటికీ, సచిన్ మాత్రం చాలా కఠినమైన బ్యాట్స్మన్ అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ‘సచిన్ను ఔట్ చేయాలంటే అంత ఈజీగా ఉండేది కాదు. టెక్నికల్గా సచిన్ చాలా స్ట్రాంగ్. అతను ఏమైనా పొరపాటు చేస్తే తప్పా అంత సులువుగా ఔటయ్యేవాడు కాదు. దీంతో సచిన్ తప్పులు చేసేలా బంతులు వేసి బౌలర్లు పైచేయి సాధించేవారి తప్పితే, సాంకేతికంగా చూస్తే అతని కంటే బెస్ట్ బ్యాట్స్మన్ను ఇప్పటివరకూ నేను చూడలేదు. నాకు తెలిసి సచిన్ను టెక్నికల్గా గమనిస్తే బలహీనతలు ఏమీ కనబడేవికావు. నా వరకూ సచిన్ అందరికంటే అత్యుత్తమం' అని క్లార్క్ పేర్కొన్నాడు.
ఈ తరంలో కోహ్లీ బెస్ట్ బ్యాట్స్మన్..
ప్రస్తుత శకంలో అన్ని ఫార్మాట్ల పరంగా చూస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బెస్ట్ బ్యాట్స్మన్ అని స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనకంటూ ఒక మార్కును సంపాదించుకున్న కోహ్లి.. టెస్టు క్రికెట్లో కూడా తన జోరును కొనసాగిస్తుండటమే ఇందుకు నిదర్శనమని క్లార్క్ తెలిపాడు. అయితే సచిన్, కోహ్లిల్లో సాధారణంగా కనిపించే కామన్ పాయింట్ ఈ ఇద్దరూ భారీ సెంచరీలు చేయడాన్ని ఎక్కువగా ఆస్వాదించడమేనని తెలిపాడు.
స్లెడ్జింగ్ చేయడానికి భయపడుతున్నారు..
ఇక ఇదే షోలో క్లార్క్ ఆసీస్ క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేసేందుకు తమ క్రికెటర్లు భయపడ్తున్నారని తెలిపాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఐపీఎల్ టోర్నీలోనూ భారత్ బలమేంటో అందరికీ తెలుసు. ఆసీస్ ఆటగాళ్లే కాకుండా దాదాపు అన్ని జట్ల ప్లేయర్లు టీమిండియాకు వ్యతిరేకంగా ఉండటానికి ఇస్టపడరు. భారత క్రికెటర్లపై స్లెడ్జింగ్కి దిగితే.. తమ ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్లు భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.'అని ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.ఆసీస్ తరఫున 115 టెస్టులు ఆడిన క్లార్క్ 48.83 సగటుతో 8643 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు ఉన్నాయి. 245 వన్డేల్లో 44.59 సగటుతో 7981 పరుగులు చేశాడు.