చెలరేగిన జానీ భాయ్..
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో మంచి శుభారంభాన్ని అందించారు. తొలి రెండు ఓవర్లు డిఫెన్స్కే పరిమితమైన ఈ జోడీ.. అనంతరం గేర్ మార్చింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో జానీ బెయిర్ స్టో వరుస బంతుల్లో 4, 4, 6, 4 బాది 18 పరుగులు పిండుకున్నాడు. మిల్నే వేసి ఆ మరుసటి ఓవర్లో వార్నర్ ఫోర్ కొట్టగా.. జానీ భాయ్ రెండు వరు సిక్స్లతో విరుచుకుపడ్డాడు. బెయిర్ స్టో జోరును అడ్డుకునేందుకు రోహిత్.. కృనాల్ను తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ఆ ఓవర్లో జానీ ఓ సిక్స్ బాదగా.. వార్నర్ ఫోర్ కొట్టాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 57 రన్స్ చేసింది.
వార్నర్ రనౌట్..
ఆ తర్వాత కూడా బెయిర్ స్టో అదే రీతిలో ఆడాడు. అయితే కృనాల్ పాండ్యా వేసిన 8 ఓవర్ రెండో బంతికి బెయిర్ స్టో హిట్ వికెట్ కావడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(2)పేలవ షాట్తో పెవిలియన్ చేరగా.. క్రీజులోకి వచ్చిన విరాట్ సింగ్తో వార్నర్.. ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సూపర్ ఫీల్డింగ్కు వార్నర్ రనౌట్గా వెనుదిరిగాడు. దాంతో హైదరాబాద్ పతనం మొదలైంది.
మలుపు తిప్పిన హార్దిక్ పాండ్యా..
దీపక్ చాహర్ వేసిన 15వ ఓవర్లో విరాట్ సింగ్(11), అభిషేక్ శర్మ(2) ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ రెండు భారీ సిక్సర్లు కొట్టి ఆశలు రేకెత్తించాడు. అతనికి జతగా అబ్దుల్ సమద్ కూడా బౌండరీ బాడాడు. కానీ హార్దిక్ పాండ్యా మరోసారి తన మెరుపు ఫీల్డింగ్తో సమద్ను రనౌట్ చేశాడు. ఆ వెంటనే రషీద్ ఖాన్(0) ఎల్బీగా వెనుదిరగ్గా.. విజయ్ శంకర్( 25 బంతుల్లో 28) భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేారాడు. చివరి ఓవర్లలో భువనేశ్వర్ (1), ఖలీల్ అహ్మద్(1) బౌల్డ్ అవ్వడంతో రెండు బంతులు మిగిలుండగానే హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది.