సిడ్నీ: భారత్తో సిరీస్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎదుర్కోవడమే మాకు అతి పెద్ద సవాల్ అని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినీస్ అన్నాడు. ఫిబ్రవరిలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో ఓ చానెల్తో మాట్లాడిన స్టోయినీస్.. సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ ఆట తమకు అత్యంత ప్రమాదకరమని తెలిపాడు. అయితే తమ జట్టు బలంగా ఉందని, ఇరుజట్ల మధ్య పోటీ గొప్పగా ఉండబోతోందని తెలిపాడు. ఈ ఏడాది ట్రోఫీని కచ్చితంగా సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత సిరీస్లో అద్బుతంగా రాణించిన రిషభ్ పంత్ రోడ్డుప్రమాదానికి గురై సిరీస్కు దూరమవడం బాధాకరమన్నాడు.
'భారత్లో స్పిన్ను ఎదుర్కొని భారీ స్కోరు రాబట్టడం అంత సులభం కాదు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. కానీ మా జట్టు బలంగా ఉంది. మేము కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నాం. ఇరుజట్ల మధ్య పోటీ మామూలుగా ఉండదు. విరాట్ కోహ్లీ ఒక ప్రపంచ స్థాయి ఆటగాడు. అతను ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక టెస్టుల్లో అతనికి తిరుగేలేదు.
ప్రస్తుతం అతన్ని ఎదుర్కోవడం మాకు సవాలుగా మారింది. అయినప్పటికీ ఈసారి ట్రోఫీని మాత్రం వదులుకోం. రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. దురదృష్టవశాత్తు ఈ సిరీస్లో తాము అతన్ని ఒక్కడిని మిస్సవుతున్నాం'అని మార్కస్ స్టోయినీస్ చెప్పుకొచ్చాడు. భారత్ - ఆస్ట్రేలియా తొలి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్పుర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్ భారత్కు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలన్నా.. టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకోవాలన్నా ఈ సిరీస్ టీమిండియా గెలవాలి.
ఈ సిరీస్లో భాగంగా జరిగే తొలి రెండు టెస్ట్లకు భారత సెలెక్టర్లు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టెస్ట్ ఫార్మాట్కు ఎంపికవ్వగా.. రిషభ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్ కోసం సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతిలో ఉండగా ఫిబ్రవరి 2న ప్రాక్టీస్ క్యాంప్లో జట్టుతో కలవనున్నారు.