న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో భయపడే పరిస్థితులు నెలకొన్నా అన్ని రంగాల్లాగే క్రికెట్ను కూడా మొదలెట్టాలని భారత మాజీ క్రికెటర్ మదన్లాల్ అభిప్రాయపడ్డాడు. ఇది చాలా అవసరమని, అక్టోబర్-నవంబర్లో ఆటను ప్రారంభించాలనే బీసీసీఐ ప్రణాళికలు రచించాలని సూచించాడు. 1983 విన్నింగ్ వరల్డ్ కప్ టీమ్ సభ్యుడైన మదన్లాల్ సలాం క్రికెట్ 2020 కార్యక్రమంలో మాట్లాడుతూ.. క్రికెట్ అనేది బిలియన్ డాలర్ల ఇండస్ట్రీ అని తెలిపాడు. 'ఇప్పుడు భయానక పరిస్థితులు తలెత్తినా త్వరలోనే క్రికెట్ మళ్లీ మొదలవ్వాలి, ఇదొక బిలియన్ డాలర్ల ఇండస్ట్రీ' అని పేర్కొన్నాడు.
ఆట మళ్లీ మొదలయ్యాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై ఐసీసీ ఇటీవల కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందని, అందులో బంతికి మెరుపు వచ్చేందుకు ఉమ్ము రాయొద్దని స్పష్టంచేసిందని గుర్తుచేశాడు. 'బంతికి ఉమ్ము అంటించకపోవడం బౌలర్లకు మొదట్లో కష్టంగా అనిపించినా ఇప్పుడు అన్నింటికీ సిద్ధపడాలి. ఇప్పటి నుంచే అలా సన్నద్ధమవ్వాలి. లాక్డౌన్ తర్వాత ప్రజలు ఎలాగైతే బయటకు వస్తున్నారో క్రికెట్ కూడా అలాగే తిరిగి కొనసాగాలి' అని అభిప్రాయపడ్డాడు.
ఇక వచ్చేనెలలో ఇంగ్లండ్- వెస్టిండీస్ టెస్టు సిరీస్పై స్పందించిన మదన్లాల్.. ఈ సిరీస్తోనే ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ ఎలా ఆడాలో తెలుస్తుందని చెప్పాడు. ఇతర టోర్నీలకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందన్నాడు. క్రికెట్ మళ్లీ మొదలవ్వడం ఎంతో ముఖ్యమని, సెప్టెంబర్-అక్టోబర్ కల్లా ప్రారంభమవ్వాలని ఆశాభావం వ్యక్తంచేశాడు. బీసీసీఐ ఈ విషయంపై కసరత్తులు చేయాలన్నాడు. అలాగే స్టేడియాల్లో కూడా సామాజిక దూరం పాటిస్తూ తక్కువ సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని సూచించాడు.
'ఇంగ్లండ్ వెస్టిండీస్ సిరీస్ ఇతర టోర్నీలకు మార్గదర్శకం కానుంది. క్రికెట్ పునప్రారంభం కావడం చాలా ముఖ్యం. సెప్టెంబర్-అక్బోబర్ వరకు ఆట ప్రారంభం కావాలి. బీసీసీఐ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేయాలి. స్టేడియాల్లో కూడా భౌతిక దూరం పాటిస్తూ తక్కువ సంఖ్యలో అభిమానులను అనుమతించాలి. 40 వేల సామర్థ్యం కలిగిన మైదానల్లో 10వేల మందిని మాత్రమే అనుమతించాలి'అని మదన్లాల్ అభిప్రాయపడ్డాడు.