న్యూఢిల్లీ: యువరాజ్ సింగ్ కళాత్మక కవర్ డ్రైవ్లు... సెహ్వాగ్ అప్పర్ కట్ షాట్లు.. పఠాన్ సూపర్ స్వింగర్లు.. పక్షిలా ఎగిరి బంతిని అందుకునే మహ్మద్ కైఫ్ ఫీల్డింగ్ మెరుపులు.. ఇవన్నీ మధుర జ్ఞాపకాలు..! అభిమానుల మదిలో చెరగని ముద్రవేసిన ఇలాంటి అపురూప దృశ్యాలు మరోసారి కళ్ల ముందు సాక్షాత్కారం కానున్నాయి..! క్రికెట్కు వీడ్కోలు పలికిన మహామహులు మరోసారి మైదానంలో తలపడేందుకు సిద్ధమయ్యారు...! వయసు మీద పడ్డా రెట్టించిన ఉత్సాహంతో పోటీకి సై అంటున్నారు..! టెస్టులు, వన్డేల్లో తమ ఆటతో క్రికెట్కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు.. పొట్టి ఫార్మాట్లో పోటీ పడనున్నారు..! గత రెండేళ్లు రోడ్ సెఫ్టీ సిరీస్ పేరిట అభిమానులను అలరించిన అలనాటి దిగ్గజ ఆటగాళ్లు ఈ సారి లెజండ్స్ క్రికెట్ లీగ్తో ముందుకు వస్తున్నారు.
ఇక ఈ లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 20 నుంచి ఒమన్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే జట్ల కెప్టెన్ల వివరాలను నిర్వహాకులు వెల్లడించారు.
భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించే మహారాజ టీమ్కు సారథిగా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్గా మహ్మద్ కైఫ్ ఎంపికయ్యాడు. కోచ్గా ఆస్ట్రేలియన్ మాజీ ప్లేయర్ జాన్ బుచనన్ను నియమించారు. టోర్నీలో ఆడబోయే మరో రెండు జట్లు.. ఆసియా లయన్స్కు సారథిగా మిస్బా ఉల్ హక్, వైస్ కెప్టెన్గా తిలకరత్నె దిల్షాన్, కోచ్గా అర్జున రణతుంగ.. వరల్డ్ జెయింట్స్కు సారథిగా డారెన్ సామీ, జాంటీ రోడ్స్ మెంటార్గా వ్యవహరించనున్నారు.
ఈ లీగ్లో భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్తో పాటు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, బద్రినాథ్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, మన్ప్రీత్ గోనీ, హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు, మునాఫ్ పటేల్, సంజయ్ బంగర్, నయన్ మోంగియా, అమిత్ భండారి ఆడనున్నారు. ఈ లీగ్ కమిషనర్గా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యవహిస్తున్నాడు.