రైతులు లేకుంటే ఆహారం ఉండదు..
ఈ విషయాన్ని మన్దీప్ సింగే సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు. రైతులు లేకపోతే మనకు ఆహారం ఉండదని, అన్నదాతల సమస్యలకు పరిష్కారం లభించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు. 'ఢిల్లీ సరిహద్దుల్లో వణికించే చలిలో ఆందోళన చేస్తున్న రైతులను చూసి చలించిపోయా. సీనియర్ సిటిజన్స్ అయినా తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా పోరాడుతున్నారు. అందుకే వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఈ మధ్యే నా తండ్రి చనిపోయారు. నాన్న బతికుంటే ఆయన కూడా వచ్చి ఆందోళనలో పాల్గొనేవారు' అని మన్దీప్ సింగ్ టైమ్స్ ఇండియాతో అన్నాడు.
తండ్రి మరణించినా..
28 ఏళ్ల మన్దీప్ సింగ్ ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. టోర్నీ సమయంలోనే మన్దీప్ తండ్రి, అథ్లెటిక్స్ మాజీ కోచ్ హర్దేవ్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. తండ్రి మరణవార్త తెలిసినా.. ఆ బాధను దిగమింగుకుని మ్యాచ్ ఆడి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇక పంజాబ్ టీమ్ కూడా థ్రిల్లింగ్ విజయాలతో మన్దీప్ తండ్రికి ఘన నివాళులర్పించింది. కానీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. పంజాబ్ రంజీ కెప్టెన్ అయిన మన్దీప్ సింగ్.. భారత్ తరఫున 3 అంతర్జాతీయ టీ20లు ఆడాడు.
పురస్కారాలను సైతం..
ఇక రైతుల ఆందోళనకు ఇప్పటికే ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ సహా పలువురు క్రీడాప్రముఖులు మద్దతు పలికారు. అన్నదాతలకు మద్దతుగా పంజాబ్కు చెందిన కొందరు క్రీడాకారులు తమ పురస్కారాలను వెనక్కి ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. పంజాబ్కు చెందిన బాక్సర్లు కౌర్ సింగ్, గుర్భక్స్ సింగ్ సంధు, జైపాల్ సింగ్లు తమ అవార్ధులను వెనక్కిచ్చేస్తామని కూడా ప్రకటించారు.
బంద్ సక్సెస్..
ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతమైంది. రైతులు, వారి మద్దతుదారుల దేశవ్యాప్త నిరసన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, విజయవంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా నాలుగు గంటల పాటు(మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు) బంద్ నిర్వహించాలన్న రైతు సంఘాల పిలుపునకు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్.. తదితర రాష్ట్రాల్లో బంద్ 100% విజయవంతమైంది. ఒడిశా, మహారాష్ట్ర, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బిహార్ల్లోనూ బంద్ ప్రభావం అధికంగా కనిపించింది.