|
6 సిక్సర్లతో వీరవిహారం..
యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 40)ఔటైన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన హుడా.. వచ్చిరావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. శివమ్ దూబే వేసిన 13 ఓవర్లో రెండు సిక్స్లతో తన ధనాధన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన హుడా.. బౌలర్ ఎవరా? అనేది సంబంధం లేకుండా చెలరేగాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్తో కలిసి మూడో వికెట్కు ఏకంగా 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అదే జోరులో క్రిస్ మోరిస్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. లేకుంటే అతని దూకుడుకు సులువుగా సెంచరీ చేసేవాడు.
|
కృనాల్ X దీపక్ డిష్యూం, డిష్యూం..
దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ పాండ్యా అకారణంగా తనపై నోరు పారేసుకున్నాడని.. టీమ్ సభ్యులు, ఇతర టీమ్స్ ముందు తన పరువుకు భంగం కలిగించాడని వైస్ కెప్టెన్ దీపక్ హుడా సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా తాను జట్టును వీడుతున్నట్లు కూడా ప్రకటించాడు. ఈ వివాదం భారత క్రికెట్లో పెనుదుమారం సృష్టించడంతో విచారణ చేపట్టిన బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) తప్పు దీపక్ హుడాదేనని తేల్చి అతన్ని టీమ్ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో హుడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదు. ఆ కసంతా ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లోనే చూపించాడు. బంతిని అతను బాదే విధానంతోనే ఈ విషయం స్పష్టమైంది.
|
కృనాల్ ముఖ చిత్రం ఏంటో..?
ఈ క్రమంలోనే దీపక్ హుడా ఇన్నింగ్స్పై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. 'దీపక్ భాయ్ ప్రతీ బంతిలో కృనాల్ కనబడ్డాడా? ఏంది అలా బాదేసావ్'అని ఒకరంటే.. ఇప్పుడు కృనాల్ పాండ్యా ముఖచిత్రం ఏంటోనని మరికొందరు ట్వీట్ చేశారు. ఇక నిరాశగా ఉన్న కృనాల్ ఫొటోలను ఏమోజీలుగా షేర్ చేస్తున్నారు. కృనాల్ పాండ్యా-దీపక్ హుడా ముఖా ముఖి పోరును చూసేందుకు ఆగలేకపోతున్నామని మరికొందరూ కామెంట్ చేస్తున్నారు. దీపక్ హుడా విధ్వంసకర ఇన్నింగ్స్కు కృనాల్ వణికిపోతున్నాడనే ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. 'సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదనే కసి రాజస్థాన్పై చూపించాడు. మరి ముంబైపై ఎలా ఆడుతాడో?'అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
|
శాంసన్ పోరాడినా..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 రన్స్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91), దీపక్ హుడా పరుగుల సునామీ సృష్టించారు. వీరికి అండగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 40)రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ మోరిస్కు రెండు, రియాన్ పరాగ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119) సెంచరీతో ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ రెండు, రిలే మెరిడిత్, జై రిచర్డ్సన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.