
2020లో రాహుల్ హిట్:
కరోనా కారణంగా ఈ ఏడాది క్రికెట్ ఎక్కువగా జరగలేదు. జరిగిన దాంట్లో కేఎల్ రాహుల్ అందరికన్నా బాగా ఆడాడు. 2020లో భారత్ తరఫున వన్డే, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసింది రాహులే. సాధారణంగా పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పోటీపడతారు. మూడేళ్లుగా ఇదే జరుగుతోంది. అయితే ఈసారి మాత్రం రాహుల్ టాప్లో నిలిచాడు. ఈ సంవత్సరంలో మొత్తం 20 అంతర్జాతీయ మ్యాచులాడిన రాహుల్ 49.82 సగటుతో 847 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇవన్నీ వన్డే, టీ20లే కావడం గమనార్హం. విరాట్ కోహ్లీ 22 మ్యాచులాడి 36.60 సగటుతో 842 పరుగులే చేశాడు. రోహిత్ శర్మ ఈ ఏడాది 7 మ్యాచులాడి 51.83 సగటుతో 311 పరుగులు చేశాడు. కీపర్గా రాహుల్ ఆకట్టుకున్నాడు.

రాహుల్ తర్వాతే కోహ్లీ:
కేఎల్ రాహుల్ పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు కీలక ఆటగాడిగా మారిపోయాడు. నిలకడ లేమితో జట్టులో చోటు కోల్పోయిన అతడు విరామంలో ఎంతో సాధన చేశాడు. రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో మానసిక దృఢత్వం పెంచుకున్నాడు. టెస్టుల్లో టీ20 తరహా ఆధునిక షాట్లతో త్వరగా ఔటై విమర్శల పాలయ్యాడు. ఇప్పుడా గందరగోళం నుంచి బయటపడ్డాడు. పక్కాగా ఎంచుకున్న షాట్నే ఆడుతున్నాడు. నిలకడకు మరోపేరుగా మారాడు. పెరిగిన అతడి సగటే ఇందుకు ఉదాహరణ. ఈ ఏడాది 9 వన్డేలాడిన రాహుల్ 55.37 సగటు, 106.23 స్ట్రైక్రేట్తో 443 పరుగులు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. 431తో విరాట్ కోహ్లీ అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో అయితే మహ్మద్ హఫీజ్ (415) తర్వాత టాప్-2లో నిలిచాడు.

ఐదో స్థానంలో దిగి శతకం :
ఈ ఏడాది రాహుల్ ఆడిన కొన్ని ఇన్నింగ్స్లు అద్భుతం. ఫిబ్రవరిలో మౌంట్మాంగనూయ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఐదో స్థానంలో దిగి శతకం బాదేశాడు. 62/3తో ఉన్న స్కోరును శ్రేయస్ అయ్యర్ (62), మనీశ్ పాండే (42) సహకారంతో తను ఔటయ్యే సమయానికి 269/5కు తీసుకెళ్లాడు. ఇదే సిరీసులో మొదటి వన్డేలో 5వ స్థానంలో 64 బంతుల్లో చేసిన 88 పరుగుల ఇన్నింగ్సూ అలాంటిదే. 6 సిక్సర్లు, 3 బౌండరీలతో స్కోరును 347/4కు తీసుకెళ్లాడు. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి వన్డేలోనూ కోహ్లీ (89)కి అండగా 66 బంతుల్లో 76 చేసిందీ రాహుల్ ఒక్కడే.

ఐపీఎల్ 2020లో ఆరెంజ్ క్యాప్:
లోకేష్ రాహుల్ ఐపీఎల్ 2020లోనూ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 14 మ్యాచుల్లో 55.83 సగటు, 129.34 స్ట్రైక్రేట్తో 670 పరుగులు సాధించాడు. ఒక శతకం, 5 అర్ధ శతకాలు చేశాడు. 17 మ్యాచులాడి 618 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడంటేనే రాహుల్ ఆటను అర్థం చేసుకోవచ్చు. బెంగళూరుపై 132, 61 చేసినప్పుడు అజేయంగా నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన సారథి, భారతీయ బ్యాట్స్మన్గానూ రికార్డులు సృష్టించాడు. సారథ్యపరంగానూ రాహుల్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ ఆసీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

2014లో ఆరంగేట్రం:
కేఎల్ రాహుల్ 2014లో భారత్ తరఫున తొలి టెస్టు ఆడాడు. అప్పటి నుంచే అతనికి అభిమానుల ఆదరణ దక్కింది. ఇప్పటి వరకు 36 టెస్టులు, 35 వన్డేలు. 45 టీ20లు ఆడిన రాహుల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ తరఫున కొన్ని మంచి ఇన్నింగ్సులు ఆడాడు. వన్డేల్లో 45.93 సగటుతో 1332 పరుగులు చేసిన రాహుల్.. టీ20ల్లో 44.05 సగటుతో 1542 పరుగులు చేశాడు. ఇక టెస్టులో 2006 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ రాహుల్ సెంచరీ చేశాడు.
ఎంఎస్ ధోనీకి 'స్పిరిట్ ఆఫ్ ద డికేడ్'.. అవార్డుకు కారణం ఇదే!!


Click it and Unblock the Notifications












