2 పాయింట్లు ఎంతో ముఖ్యం:
మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ... 'ఈ రెండు పాయింట్లు సాధించినందుకు సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో చాలా తెలివిగా ఆడాం. ఇది మంచి వికెట్ అని ముందే అనుకున్నాం. ఎక్కువ ప్రయోగాలు చేయలేదు. తొలుత బౌలింగ్లో కాస్త రక్షణాత్మక ధోరణి ప్రదర్శించాం. బంతి పెద్దగా టర్న్ కాలేదు. బ్యాటింగ్ పరంగా ప్రతి ఒక్కరికీ ముందే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. బ్యాటర్లు భారీ షాట్లు ఆడాలని కోరాం. వీలైనంత త్వరగా పరుగులు చేయాలనుకున్నాం. ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే కసితో ఉన్నాం. ఈ విజయం మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇకపై ఇలాగే కొనసాగుతామని ఆశిస్తున్నా. ప్లే ఆఫ్స్ చేరేందుకు మాకు ఈ రెండు పాయింట్లు ఎంతో ముఖ్యం' అని అన్నాడు.
చాలా ఇబ్బందిగా ఉంటుంది:
'భారత క్రికెటర్లను పక్కనపెట్టడం ఒక కెప్టెన్గా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా మనసు పెద్దది చేసుకొని హర్ప్రీత్ను పక్కనపెట్టాం. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ జట్టును వీడాడు. దీంతో సరైన ఆటగాళ్లు ఎవరనేది చూడాలి. అలాగే షారుఖ్ ఖాన్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు మ్యాచ్లు ఫినిష్ చేయగలడని తెలుసు. ఇంతకుముందు కూడా తమిళనాడు జట్టులో ఆ రోల్ పోషించాడు. అయితే కొన్నిసార్లు మేమే ఒత్తిడికి లోనయ్యాం. మాది ఎంత మంచి జట్టో అందరికీ తెలిసిందే. మాకు మేమే ఒత్తిడికి గురవ్వడం ఇబ్బంది పెట్టింది. మా శక్తి మేరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే ఆదేశాలున్నాయి. టోర్నీల్లో చివరి వరకూ పోరాడటమే లక్ష్యంగా పెట్టుకున్నాం' అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.
ఓడిపోవడానికి అదే కారణం:
కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ... 'ముందుగా మేం అంత బాగా ఫీల్డింగ్ చేయలేదు. నాతో పాటు ఇతరులు క్యాచ్లు వదిలేశారు. మేం వెనుకబడటానికి అదే కారణం. చివర్లో మ్యాచ్ అంత రసవత్తరంగా మారినప్పుడు 2-3 వికెట్లు పడితే వాళ్లపై ఒత్తిడి పెరిగి మాకు ఉపయోగపడేది. గెలవడానికి మేం కూడా తీవ్రంగా శ్రమించాం. మా బ్యాటింగ్ బాగుంది. ఈ పిచ్పై మోస్తరు స్కోర్ చేసినా అది గెలవడానికి సరిపోదు. అయినా బౌలర్లు విజయం కోసం శ్రమించారు. పంజాబ్ మాకన్నా బాగా ఆడింది. 19వ ఓవర్లో రాహుల్ ఔటయ్యాడనుకున్నా.. కానీ మనం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని గౌరవించాలి. ఒకవేళ ఆ వికెట్ పడితే ఫలితం మరోలా ఉండేది. వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడు. మాకు దొరికిన ఓ మంచి ఆటగాడు అతడు. ఏ మాత్రం భయపడకుండా ఆడుతూ.. బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. మాకింకా రెండు మ్యాచ్లు ఉన్నాయి. వాటిల్లో విజయం సాధించి ముందుకు సాగుతాం' అని చెప్పుకొచ్చాడు.