
స్పిన్నర్లకు అనుకూలం:
ఐపీఎల్ 2021 సీజన్లో జరుగుతోన్న 46వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగనుంది. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. 3 గంటలకు టాస్ పడనుంది. ఈ మ్యాచ్ షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ స్టార్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో మ్యాచ్ను చూడాలనుకునే వారు హాట్స్టార్లో మ్యాచ్ వీక్షించవచ్చు. షార్జా మైదానం చిన్నది కావడం, ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్న నేపథ్యంలో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం వరకు షార్జా పిచ్ బ్యాటర్లకు అనుకూలించింది. ఇప్పుడు మాత్రం స్పిన్నర్లకు సహకరిస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు భారీ స్కోర్ నమోదు కాలేదు. గత 4 మ్యాచ్లలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు 157. ఇందులో ఛేజింగ్ చేసిన టీమ్ 3 సార్లు గెలిచింది.

తేలిపోతున్న సూర్య:
ఐపీఎల్ 2021లో వరుస ఓటములతో సతమతమవుతోన్న ముంబై ఇండియన్స్ గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో ముంబై బ్యాటింగ్లో దారుణంగా విఫలమవుతోంది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, రోహిత్ శర్మలు సరైన ఆరంభాలు ఇవ్వట్లేదు. ఒకరు మెరిస్తే.. మరొకరు త్వరగానే ఔట్ అవుతున్నారు. దాంతో మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు కావట్లేదు. అయినా కూడా కీలక సమయంలో చెలరేగే ఈ జోడీపై అంచనాలు నెలకొన్నాయి. ఈరోజ ఇద్దరు చెలరేగాల్సిన అవసరం ఉంది. గత సీజన్లో మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్లో తేలిపోయాడు. ఇప్పటికైనా అతడు గాడిలో పడాల్సిన అవసరం ఉంది.

ఇషాన్ కిషన్కు మరోసారి నిరాశే:
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆకట్టుకున్న సౌరభ్ తివారి (45)పై భారీ అంచనాలే ఉన్నాయి. వరుసగా ఫలమవుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో జట్టులోకి వచ్చిన తివారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే రెండు మంచి ఇన్నింగ్స్ ఆడిన తివారి ఈరోజు మ్యాచ్ ఆడడం దాదాపు ఖాయమే. దాంతో ఇషాన్ కిషన్కు మరోసారి నిరాశే ఎదురుకానుంది. గత మ్యాచులో సత్తాచాటిన హార్దిక్ పాండ్యా (40) ఈ మ్యాచ్లోనూ రాణించాలని ముంబై మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఇక కీరన్ పొలార్డ్ ఫినిషర్ రోల్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. మొదటి దశలో చెన్నైపై ఆడిన ఇన్నింగ్స్ పునరావృతం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మూడో పేసరా/స్పిన్నరా:
ఇక బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా రాణిస్తున్నా.. ట్రెంట్ బోల్ట్ భారీగా పరుగులు ఇస్తున్నాడు. ఈ జోడి గతంలోగా రాణించట్లేదు. ఈ ఇద్దరు రాణిస్తే ముంబై సునాయాస విజయం అందుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్పిన్ యూనిట్ కూడా విఫలమవుతోంది. షార్జా పిచ్ కాస్త స్లోగా ఉంటుంది కాబట్టి రాహుల్ చహర్, కృనాల్ పాండ్యా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరికి తోడు మరో స్పిన్నర్ (జయంత్ యాదవ్) జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మూడో పేసర్ అవసరం అనుకుంటే.. నాథన్ కౌల్టర్ నైల్, ఆడమ్ మిల్నేలలో ఒకరు జట్టులోకి రానున్నారు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెఫైన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైల్/జయంత్ యాదవ్/ఆడమ్ మిల్నే, రాహుల్ చహార్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.


Click it and Unblock the Notifications












