న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల జల్లు కురిపించాడు. అర్ష్దీప్ను టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్తో పోల్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో అర్ష్దీప్ సింగ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో సత్తా చాటిన అర్ష్దీప్.. ఇంగ్లండ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే టీమిండియాకు కీలక బౌలర్గా ఎదిగాడు.
పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసి టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఇటీవల ఆసీస్తో టీ20 సిరీస్కు విశ్రాంతి తీసుకొని సౌతాఫ్రికాతో తొలి టీ20తో రీఎంట్రీ ఇచ్చిన అర్ష్దీప్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ క్రమంలోనే అర్ష్దీప్ సింగ్ను అప్పటి పేసర్ జహీర్ ఖాన్తో పోలుస్తూ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అర్ష్దీప్ సింగ్ అద్భుతమైన బౌలర్. పేస్, స్వింగ్ రెండింటినీ రాబట్టగలడు. అంతేకాకుండా మానసికంగా చాలా స్ట్రాంగ్. తన సామర్థ్యంపై అతడికి ఎంతో నమ్మకముంది. పరిస్థితులకు అనుగుణంగా అస్త్రాలను ఎలా వాడాలో తెలుసు. అందుకే టీమ్ఇండియాకు కొత్త జహీర్ ఖాన్ దొరికాడని భావిస్తున్నా.
సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా అర్ష్దీప్ బౌలింగ్ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. రొస్సొసౌ, డికాక్, మిల్లర్ను పెవిలియన్కు చేర్చాడు. అయితే ఇందులో డేవిడ్ మిల్లర్ వికెట్ ప్రత్యేకం. షార్ప్ ఇన్స్వింగర్తో క్లీన్బౌల్డ్ చేశాడు. ఎంతో పరిణతిగా బంతులను సంధించాడు. భారత్కు ఇది శుభసూచికం. ఎందుకంటే జహీర్ ఖాన్ వంటి లెఫ్ట్ఆర్మ్ బౌలర్ భారత్కు అవసరమైన సందర్భంలోనే అర్ష్దీప్ దొరికాడు'అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు. అర్ష్దీప్ ఇప్పటి వరకు భారత్ తరఫున 12 టీ20లను ఆడగా.. 7.44 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. ఆసియాకప్లో కీలక క్యాచ్ నేలపాలు చేసి జుగుప్సాకరమైన ట్రోలింగ్ను ఎదుర్కొన్న అర్ష్దీప్.. మానసికంగా ఏ మాత్రం బలహీన పడలేదు. తన ఆటతోనే విమర్శకుల నోరు మూయించాడు.