జొహన్నెస్బర్గ్: సౌతాఫ్రికాలో క్రికెట్ను రీస్టార్ట్ చేసేందుకు కొత్తగా ప్రవేశపెడుతున్న త్రీ టీమ్ క్రికెట్(3టీసీ) సాలిడారిటీకప్ మ్యాచ్కు పేసర్ కగిసో రబాడ, ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ దూరమయ్యారు. శనివారం సెంచూరియన్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. కుటుంబ సభ్యుల మరణంతో రబాడ, మీడియం పేసర్ సిసాండా మగలా ఈ మ్యాచ్ల్లో ఆడటం లేదు. ఇక 33 ఏళ్ల మోరిస్ కూడా అనివార్య కారణాలతో ఈ టోర్నీకి అందుబాటులో ఉండటం లేదని నిర్వాహకులు తెలిపారు.
ఈ ముగ్గురి స్థానంలో మాజీ పేసర్ మఖాయ ఎన్తిని కొడుకు తాండో ఎన్తిని (కింగ్ ఫిషర్స్), జోర్న్ ఫోర్టిన్(ఈగల్స్), గెరాల్డ్ కొయెట్జీ (కింగ్ ఫిషర్స్)ను తీసుకున్నారు. రబాడ గైర్హాజరీతో క్లాసెన్.. కింగ్ ఫిషర్స్ టీమ్ను లీడ్ చేయనున్నారు. డివిలియర్స్(ఈగల్స్), డికాక్ (కైట్స్)కు సారథ్యం వహించనున్నారు. మొత్తం 24 మంది సఫారీ టాప్ క్రికెటర్లు ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతున్నారు.
ఈ సరికొత్త 3టీ క్రికెట్ కాన్సెప్ట్లో 36 ఓవర్లతో 8 మంది సభ్యులతో కూడిన మూడు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ను 18 ఓవర్ల చొప్పున రెండు భాగాలుగా ఆడిస్తారు. మధ్యలో బ్రేక్ ఉంటుంది. తొలి అర్థభాగంలో ఓ టీమ్.. ఒక ప్రత్యర్థితో ఆరు ఓవర్లు ఆడుతుంది. సెకండాఫ్లో ఆ జట్టు మరో ప్రత్యర్థితో మరో ఆరు ఓవర్లు ఆడుతుంది. ఇలా ప్రతి జట్టుకు 12 ఓవర్లు (బ్యాటింగ్, బౌలింగ్) ఆడే అవకాశం లభిస్తుంది.
ఫస్టాఫ్లో తొలుత ఎవరు బ్యాటింగ్ చేయాలి, ఎవరు బౌలింగ్ చేయాలి, ఎవరు డగౌట్లో ఉండాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు. ఫస్టాఫ్లో అత్యధిక స్కోరు చేసిన టీమ్ సెకండాఫ్లో మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఒకవేళ స్కోర్లు టై అయితే.. ఫస్టాఫ్లో ఆడిన స్థానాలను రివర్స్ చేస్తారు. అంటే మొదట బ్యాటింగ్ చేసిన టీమ్తో బౌలింగ్.. బౌలింగ్ చేసిన జట్టుతో బ్యాటింగ్ చేయిస్తారు.