కరాచీ: ఆటగాళ్లకు మైదానంలోని ఒత్తిడిని అధిగమించడం ఎలానో తెలియాలంటే భారత్తో ఒకసారి మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ పేసర్ జునైద్ ఖాన్ సూచించాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్లే అత్యంత ఒత్తిడితో కూడుకున్నవని తెలిపాడు. 2012-13లో భారత్తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో తనకు ఆ అనుభవం ఎదురైందని గుర్తు చేసుకున్నాడు.
ఆ సిరీస్లో తాను హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచానన్నాడు. ఆ సిరీస్లో మొత్తం 8 వికెట్లు తీసిన అతను ఢిల్లీ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీశాడు. తాజాగా క్రికెట్ పాకిస్థాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సిరీస్ విశేషాలను పంచుకున్న జునైద్ ఖాన్.. ఒత్తిడిని ఎలా అధిగమించాలో అప్పుడే తెలిసిందన్నాడు.
'ఆటగాళ్లకు ఒత్తిడిని అధిగమించడం ఎలానో తెలియాలంటే వారు కచ్చితంగా భారత్తో మ్యాచ్ ఆడాలి. భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ల్లో ఇరుదేశాల ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఇరు దేశాల అభిమానులు ఈ మ్యాచ్లను బాగా ఆస్వాదిస్తారు. కానీ భారత్-పాక్ మధ్య సిరీస్లు నిర్వహించాలనే నిర్ణయం పరిపాలకులపై ఆధారపడి ఉంది'అని జునైద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
ఇక పాకిస్థాన్ టీమ్మేనేజ్మెంట్పై జునైద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టులో కొనసాగాలంటే కెప్టెన్, టీమ్మేనేజ్మెంట్తో మంచి సంబంధాలు కొనసాగించాలని, వారు చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఉండకుండా నడుచుకోవాలన్నాడు. లేదంటే జట్టులో చోటు దక్కదని, కెరీరే ప్రశ్నార్థకంగా మారుతుందన్నాడు. 31 ఏళ్ల జునైద్ పాక్ తరఫున 22 టెస్ట్లు, 76 వన్డేలు, 8 టీ20 మ్యాచ్లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి సుమారుగా 180 వికెట్లు పడగొట్టాడు. 2019 నుంచి జట్టుకు దూరమయ్యాడు.