సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న మూడో టెస్ట్లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లో సమష్టిగా చెలరేగి భారత్ను కట్టడి చేసింది. ముందుగా 96/2 ఓవర్నైట్ స్కోర్తో ఆటను కొనసాగించిన భారత్ను సూపర్ బౌలింగ్తో 244 పరుగులకే పరిమితం చేసింది. రెండో రోజు ఆటలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన భారత్.. మూడో రోజు కనీసం 300 పరుగులైన సులువుగా చేస్తుందనిపించింది. కానీ ఆసీస్ మార్క్ ఫీల్డింగ్ ముందు భారత బ్యాట్స్మెన్ చతికిల పడ్డారు. ముగ్గురు బ్యాట్స్మెన్ రనౌట్ కావడం ఆసీస్ ఫీల్డింగ్ ప్రమాణాలను తెలియజేస్తోంది. ఈ మూడు రనౌట్లలో హనుమ విహారీ ఔటైన తీరు ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచింది.
టీమిండియా తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే ఔటైన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హనుమ విహారి.. నాథన్ లయన్ వేసిన 68 ఓవర్లో మిడాఫ్ వైపుకు బంతిని ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న జోష్ హజెల్ వుడ్ బంతిని అంతే వేగంగా అందుకొని వికెట్లను హిట్ చేశాడు. ఈ సూపర్ రనౌట్కు మైదానంలోని ఆటగాళ్లు, కామెంటేటర్లు బిత్తరపోయారు. విహారీ చాలా నిరాశగా వెనుదిరిగాడు. భారత్ వికెట్ల పతనానికి ఈ రనౌట్ టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. విహారి కనుక క్రీజ్లో ఉండి ఉంటే భారత్.. ఇన్నింగ్స్ మరికొంత ముందుకు సాగేది. ప్రస్తుతం విహారి రనౌట్కు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ శనివారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్ పుకోస్కీ(10), డేవిడ్ వార్నర్ (13) తీవ్రంగా నిరాశ పర్చగా.. మార్నస్ లబుషేన్(47 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్(29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి ఆసీస్ 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. సిరాజ్, అశ్విన్కు చెరొక వికెట్ దక్కింది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
Don't take on the Hoff! ⚡@hcltech | #AUSvIND pic.twitter.com/eXFpRPuKiJ
— cricket.com.au (@cricketcomau) January 9, 2021