లండన్: అందరూ ఊహించినట్లుగానే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు గురువారం ఓ ప్రకటనను విడదలు చేసింది. గతకొంత కాలంగా నిలకడలేమి ఫామ్తో సతమతమైన ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దాంతో ఏడున్నరేళ్లు జట్టును నడిపించిన మోర్గాన్ వారుసుడిగా.. ఇంగ్లండ్ నయా కెప్టెన్గా జోస్ బట్లర్ను ఈసీబీ నియమించింది. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న జోస్ బట్లరే మోర్గాన్ వారుసుడిగా సరైనవాడని ఆ బోర్డు పేర్కొంది.
భారత్తో జూలై 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్తో బట్లర్ సారథ్య బాధ్యతలు స్వీకరించనున్నాడు. వైట్ బాల్ క్రికెట్ నయా కోచ్ మాథ్యూ మోట్తో కలిసి బట్లర్ పని చేయనున్నాడు. అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా ఈ ద్వయం పని చేస్తుందని ఆ జట్టు డైరెక్టర్ రాబ్ కీ తెలిపాడు. 'ఇయాన్ మోర్గాన్కు అసలు సిసలు వారుసుడు జోస్ బట్లరే. ఈ బాధ్యతల అతనికి అప్పగించేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వైట్ బాల్ క్రికెట్లో గత కొంతకాలంగా బట్లర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తనదైన ఆటతో సహచరుల గౌరవాన్ని కూడా అందుకుంటున్నాడు.'అని రాబ్ కీ పేర్కొన్నారు.
ఇక ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్గా ఎంపికవ్వడంపై బట్లర్ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు దక్కిన అత్యంత అరుదైన గౌరవమని చెప్పాడు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ఇంగ్లండ్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. మోర్గాన్ సారథ్యంలోనే తాను ఈ స్థాయికి చేరానని, అతనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. అతని బాటలో జట్టుకు అద్భుత విజయాలు అందిస్తానని చెప్పాడు.